డబ్బులిచ్చుకో.. పేరు చేర్చుకో..!
ABN, First Publish Date - 2023-01-29T00:21:38+05:30
భూముల రీసర్వే ఇష్టారీతిన జరుగుతోంది. రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తోంది. భూమి అనుభవదారుల పేరు నమోదు చేయడానికి బేరాలు నడుస్తున్నాయి. అసైన్డ్భూమిని మీ పేరుమీద నమోదు చేయాలంటే రూ.5వేలు ఇస్తే పని పూర్తవుతోంది. అడ్డదారిలో అనధికారికంగా వందల ఎకరాలు అసైన్డ్భూములను కొని చేపలు, రొయ్యల చెరువులు సాగుచేసుకుంటున్న బడా బాబుల అక్రమం బయటకు రాకుండా వసూళ్ల పర్వంతో సక్రమం చేసేస్తున్నారు. జిల్లాలో సముద్ర తీరప్రాంతంలో వేలాది ఎకరాల అసైన్డ్ భూముల రీసర్వేలో ఇదే జరుగుతోంది.
భూమి రీసర్వే పేరుతో వసూళ్ల దందా
- అసైన్డ్భూమిని కొని అనుభవదారులుగా ఉన్న వారి నుంచి వసూళ్లు
- అడంగల్లో పేరు చేర్చాలంటే ఎకరానికి రూ.5వేలు ఇవ్వాలట
- నీటితీరువా కూడా కట్టించుకుంటామని భరోసా
- చక్రం తిప్పుతున్న రెవెన్యూ యంత్రాంగం
భూముల రీసర్వే ఇష్టారీతిన జరుగుతోంది. రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తోంది. భూమి అనుభవదారుల పేరు నమోదు చేయడానికి బేరాలు నడుస్తున్నాయి. అసైన్డ్భూమిని మీ పేరుమీద నమోదు చేయాలంటే రూ.5వేలు ఇస్తే పని పూర్తవుతోంది. అడ్డదారిలో అనధికారికంగా వందల ఎకరాలు అసైన్డ్భూములను కొని చేపలు, రొయ్యల చెరువులు సాగుచేసుకుంటున్న బడా బాబుల అక్రమం బయటకు రాకుండా వసూళ్ల పర్వంతో సక్రమం చేసేస్తున్నారు. జిల్లాలో సముద్ర తీరప్రాంతంలో వేలాది ఎకరాల అసైన్డ్ భూముల రీసర్వేలో ఇదే జరుగుతోంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలో సముద్రతీరం 110 కిలోమీటర్లు ఉంది. నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి, మచిలీపట్నం, పెడన, కృత్తివెన్ను, బంటుమల్లి మండలాల్లో వేలాది ఎకరాల అసైన్డ్భూమి ఉంది. పేదల జీవనం నిమిత్తం గతంలో ప్రభుత్వం అసైన్డ్భూములను వారికి పంపిణీ చేసింది. పేదలు వివిధ కారణాలతో విక్రయించేశారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు 10 నుంచి 15 మంది చేతులు మారాయి. రీసర్వేలో ఎవరు అనుభవదారులుగా ఉంటే వారి పేరునే నమోదు చేస్తామని రెవెన్యూ అధికారుల, వీర్వోలు చెబుతున్నారు.
బడాబాబుల ఆధీనంలో వందల ఎకరాలు
భీమవరానికి చెందిన బడాబాబులతో పాటు స్థానికంగా ఉన్న బడాబాబులు ఒక్కొక్కరి చేతుల్లో వంద నుంచి 200 ఎకరాలు అంతకుమించి భూమి కూడా ఉంది. ఈ భూములు చేపలు, రొయ్యల చెరువులుగా సాగులో ఉన్నాయి. భూమిని సాగు చేస్తూ అనుభవదారులుగా ఉన్న వారిపేర్లనే రీసర్వేలో నమోదుచేసే అవకాశం ఉండటంతో రెవెన్యూ అధికారుల వసూళ్లకు మార్గం మరింత వెసులుబాటుగా ఉంది. రైతుల పేరున అధికంగా భూమి ఉంటే మిగులు భూమి వ్యవహారంపై తరువాత దృష్టి సారిస్తారని రెవెన్యూ అధికారులు చెబుతుండటం గమనించదగ్గ అంశం.
ఫ అధికారుల సూచనలను అనుకూలంగా మలచుకుని...
జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ విడతలవారీగా జరుగుతోంది. అప్పటికపుడు రీసర్వే చేయాలంటే నిర్దేశించిన సమయంలోగా పూర్తికావడం లేదు. దీంతో ముందస్తుగా భూ వివరాలు సేకరించి పెట్టుకుంటే సంబంధిత గ్రామంలో రీసర్వే జరిగే సమయంలో పని సులువుగా, సకాలంలో పూర్తి అవుతుందని ఇటీవల ఉన్నతాధికారులు తహసీల్దార్లకు సమావేశం నిర్వహించి సూచన చేశారు. ఈ సూచననే తమకు అనుకూలంగా మలచుకుని రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు వసూళ్ల పర్వానికి తెరతీశారు.
ఎకరానికి రూ.5వేలు లంచం?
బందరు మండలంలో 17 వేల ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. అధిక భూమి మడ అడవుల జాబితాలోనే ఉంది. ఈ భూమిని బడాబాబులు గుట్టుచప్పుడుకాకుండా చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేశారు. దీనికి సంబంధించి పాత రికార్డులో భూమి యజమానుల అసలు పేర్లున్నాయి. దీంతో వీఆర్వోలు తెరవెనుక తమదైనశైలిలో చక్రం తిప్పుతున్నారు. తమవద్ద అనధికారికంగా పనిచేసే అసిస్టెంట్లను రైతుల వద్దకు వీఆర్వోలు పంపుతున్నారు. ఉదాహరణకు రుద్రవరం, గుండుపాలెం, కోన తదితర రెవెన్యూ గ్రామపరిధిలో ఒక్కో గ్రామంలో కనీసంగా రెండువేల ఎకరాలకుపైగా అసైన్డ్భూమి ఉంది. ఈ భూమి పలువురి చేతులు మారడంతో వీర్వోల వద్ద పనిచేసే అసిస్టెంట్లు రైతుల వద్దకు వెళ్లి భూమి రీసర్వేలో అనుభవదారులుగా మీపేర్లు అడంగల్లో చేర్చాలంటే ఎకరానికి ఐదువేలు ఇవ్వాలని బేరం పెడుతున్నారు. గతంలో భూమి శిస్తు కట్టించుకోలేదు కదా అని రైతులు అడిగితే భూమి శిస్తు కూడా కట్టించుకుంటామని భరోసా ఇస్తున్నారు. 1431 ఫసలీ నీటి తీరువా కట్టే అంశం తరువాత చూద్దామని, ముందు అడంగల్లో మీపేర్లు నమోదు చేయాలంటే ఎకరానికి ఐదువేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో భూమి మీ పేరున నమోదు కాకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. గుండుపాలెం, ఆర్గొల్లపాలెం, శివగంగ ప్రాంతాల్లోని రైతుల గృహాల వద్దకు వెళ్లి వీఆర్వోల అసిస్టెంట్లు ఈ తరహా బేరాలకు దిగడం ఇటీవల కాలంలో అధికమైంది. రికార్డులు సక్రమంగా లేని, వివాదాస్పద అసైన్డ్ భూములకు చాలా సంవత్సరాలు నీటి తీరువాను కట్టించుకోకుండా నిలిపివేశారు. భూముల రీసర్వేను పురస్కరించుకుని వీర్వోలు నీటి తీరువాను వివాదాస్పద భూముల నుంచి కట్టించుకోవడం, ఈ విషయం బయటకు పొక్కడంతో బందరు మండలంలో నీటితీరువా పుస్తకాలను వీర్వోల నుంచి తహసీల్దార్ స్వాధీనం చేసుకోవడం విశేషం.
అక్రమాలు చేస్తే సహించం
భూమి రీసర్వే ప్రక్రియను ఇప్పటివరకు పార దర్శకంగానే చేశాం. ఇక ముందు కూడా అలానే సర్వే జరుగుతుంది. భూమి రీసర్వే పేరుతో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. నీటితీరువా వసూళ్లలో అవకతవకలు జరుగుతున్నాయనే కారణంతో పుస్తకాలు స్వాధీనం చేసుకున్నాం.
- డి సునీల్బాబు, తహసీల్దార్, మచిలీపట్నం
Updated Date - 2023-01-29T00:21:40+05:30 IST