సక్రమంగా తాగునీరు అందించండి
ABN, First Publish Date - 2023-03-19T00:03:36+05:30
పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు మంచినీటి సరఫరా సరిగా లేదని, తక్షణమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
నందిగామ, మార్చి 18: పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు మంచినీటి సరఫరా సరిగా లేదని, తక్షణమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. నందిగామ మునిసిపల్ సమావేశం చైర్పర్సన్ మం డవ వరలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు తాగునీరు సమస్యపై అధికారులను, చైర్పర్సన్ను నిలదీశారు. దీనిపై కమి షనర్ జయరామ్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులవల్ల కొన్ని చోట్ల పైప్లైన్ దెబ్బతినడంతో ఇబ్బంది ఏర్పడిందన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాలకు సమర్థంగా నీరందుతుందన్నారు. రోడ్ల విస్తరణ సమయంలో చెట్లను నరికి అమ్ముకున్నారని, మునిసిపాలిటీకి నామమాత్రపు ధర అందజేశారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై వైసీపీ సభ్యులు రోడ్ల విస్తరణ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, దీన్ని రాజకీయం చేస్తూ చెట్ల విషయాన్ని టీడీపీ తీసుకురావడం హేయమన్నారు. సమావేశంలో వైస్ చైర్పర్శన్ మాడుగుల నాగరత్నం, సభ్యులు పాల్గొన్నారు.
చైర్పర్సన్ కొడుకును బయటకు పంపిన అధికారులు
అనారోగ్యంతో బాధపడుతున్న చైర్పర్సన్ వరలక్ష్మి కుమారుడు భవానీశంకర్ సమావేశానికి తీసుకువచ్చారు. అనారోగ్యంతో ఉన్న ఆమెకు సహకారంగా ఉండేందుకు చైర్పర్సన్ సమీపంలో నిలబడ్డారు. కౌన్సిల్కు ఇతరులు రాకూడదని బయటకు వెళ్లిపోవాలని కమిషనర్ సూచించారు.
కో ఆప్షన్ సభ్యుల తీరు వివాదం..
కౌన్సిల్ సమావేశాలలో కోఆప్షన్ సభ్యుల తీరు వివాదాలకు దారి తీసింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన చైర్పర్సన్, కమిషనర్ల కంటే ముందే వారు జోక్యం చేసుకుంటూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. వీరు కౌన్సిల్కు సూచనలు ఇవ్వాలి తప్ప మొత్తం కౌన్సిలే తాము అన్నట్లుగా వ్యవహరించడం నిబంధనలకు విరుద్ధమని ప్రతిపక్ష సభ్యులు అంటున్నారు. రోడ్ల విస్తరణ, చెట్లు నరికివేత తదితర సమస్యలపై చర్చ సాగుతున్న సమయంలో కోఆప్షన్ సభ్యుడు ఎం.ఎ.దాసు జోక్యం చేసుకోవడంపై టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. సమాధానం చెప్పాల్సిన చైర్పర్సన్, కమిషనర్లు మౌనంగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కోఆప్షన్ సభ్యుల తీరుపై కమిషనర్ సమీక్షించుకోవాలని, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని వారు కోరుతున్నారు.
Updated Date - 2023-03-19T00:03:36+05:30 IST