ఖాళీ స్థలాలకు పన్ను కట్టాల్సిందే...
ABN, First Publish Date - 2023-04-08T00:08:30+05:30
నమ్మి ఓట్లేసిన ప్రజలు నట్టేట మునిగితే నాకేమి అన్నట్లుగా.. ఖజానా నింపుకోవడమే పనిగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోంది. పన్ను వసూళ్లకు నిత్యం ఏదో ఒక ఎత్తుగడ వేస్తూనే ఉంది. నిన్నటి వరకు గత ప్రభుత్వాలిచ్చిన గృహాలను
లేదంటే నో రిజిస్ర్టేషన్
మార్కెట్ ధరలో 0.54 శాతం పన్ను చెల్లించాలి
మౌలిక వసతులు లేకుండానే పన్నుల విధింపు
గ్రామ కంఠాలకు వీఎల్టీ వర్తించదు
అయినా పన్ను వసూళ్లకు మొగ్గు
లబోదిబో మంటున్న క్రయవిక్రయ దారులు
కడప(కలెక్టరేట్), ఏప్రిల్ 7: నమ్మి ఓట్లేసిన ప్రజలు నట్టేట మునిగితే నాకేమి అన్నట్లుగా.. ఖజానా నింపుకోవడమే పనిగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోంది. పన్ను వసూళ్లకు నిత్యం ఏదో ఒక ఎత్తుగడ వేస్తూనే ఉంది. నిన్నటి వరకు గత ప్రభుత్వాలిచ్చిన గృహాలను క్రమబద్ధీకరిస్తామంటూ ఒన్ టైం సెటిల్ మెంట్(ఓటీఎస్) పేరుతో హడావిడి చేసింది. తర్వాత ఎక్కడా లేని విధంగా చెత్తపన్ను విధించింది. ఇప్పుడు ప్లాన్ అప్రూవుల్ లేని ఖాళీ ప్లాట్లపై పన్ను విధించేలా తాజాగా సర్క్యులర్ నెంబరు 1730463 జారీ చేసి తనకు సాటి ఏదీ లేదని వైసీపీ ప్రభుత్వం నిరూపించుకుంది. ఖాళీ స్థలాలకు పన్నులు చెల్లిస్తేనే రిజిస్ర్టేషన్ ప్రక్రియ అంటూ మెలిక పెట్టింది. ఖాళీ స్థలాలపై ప్రభుత్వ మార్కెట్ ధరలో 0.54 శాతం మేర ప్రతి ఏడాది పన్ను చెల్లించాల్సిందే. అంటే సెంటు మార్కెట్ ధర రూ.లక్షగా ఉందనుకుంటే ఖాళీ స్థలానికి పన్ను రూపంలో అక్షరాల రూ.540 చెల్లించాలి. ఈ లెక్కన ఖాళీ స్థలాలకు గత మూడేళ్లకు సంబంధించి పన్నులు జమ చేస్తేనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో నిత్యం 20-30 రిజిస్ర్టేషన్లు, వందలాది మంది జనాలతో కళకళలాడుతున్న రిజిస్ర్టేషన్ కార్యాలయాలు వారం రోజులుగా డీలా పడ్డాయి.
అభివృద్ధి చేస్తేనే పన్ను వసూళ్లు
మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో 40 అడుగుల రోడ్లు వేసి డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, మౌలిక వసతులు కల్పించిన మీదటే ప్రభుత్వాలు పన్నులు వసూళ్లు చేయాలి. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకనే ఖాళీ స్థలాలకు సైతం పన్నులు వసూళ్లు చేయడాన్ని సగటు వ్యక్తుల నుంచి రియల్టర్ల వరకు ఎండగడుతున్నారు. కడప నగరాన్ని చూస్తే రెండు కిలోమీటర్ల ఫుట్ పాత్ కానీ, ఆ మూల నుంచి ఈ మూలవరకు తిరిగేందుకు సిటీ బస్సుల సౌకర్యం లేవు. ఇతర గ్రామాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు, ప్రజలకు అత్యవసరంగా ఉపయోగపడాల్సిన మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. అలాంటప్పుడు ఖాళీ స్థలాలకు పన్నులు విధించడం దుర్మార్గపు చర్య అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా కన్వర్షన్ చేసుకుని కొందరు ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. ప్లాన్ అప్రూవుల్ లేని ఇలాంటి ఖాళీ స్థలాలకు పన్నుల భారం విధించారు. గతంలో రిజిస్ర్టేషన్లు జరిగి ఉంటే లింకు డాక్యుమెట్ల ఆధారంగా రిజిస్ర్టేషన్లు చేసుకోవచ్చు. ఇలాంటి ఖాళీ స్థలాలకు వేకంట్ ల్యాండ్ టాక్సు(వీఎల్టీ) చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ఖజానా నింపేందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను సైతం తుంగలో తొక్కుతూ గ్రామ కంఠాలు, అపార్ట్మెంట్లను సైతం వదలకుండా ఖాళీ స్థలాలకు పన్ను పేరుతో సచివాలయ సిబ్బంది వసూళ్లకు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో మేరకు గ్రామ కంఠాలైన భూములు, స్థలాలకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. వీటికీ పన్నులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రోజుకో జీవో, పూటకో సర్క్యులర్ జారీ చేస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రజలపై లేనిపోని పన్నుల భారం మోపి నడ్డి విరుస్తోందని.. వసూళ్లకు నక్షత్రకుల్లాంటిసైన్యాన్ని సిద్ధం చేసుకుని వేధింపులకు పాల్పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2023-04-08T00:08:30+05:30 IST