అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి
ABN, First Publish Date - 2023-02-13T23:29:12+05:30
మండలంలోని గూడెం చెరువు రాజీవ్నగర్ కాలనీలో సోమవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో బీమిశెట్టి గగన్ (రెండున్నర సంవత్సరాలు) అనే బాలుడు మృతిచెందాడు.
జమ్మలమడుగు, ఫిబ్రవరి 13: మండలంలోని గూడెం చెరువు రాజీవ్నగర్ కాలనీలో సోమవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో బీమిశెట్టి గగన్ (రెండున్నర సంవత్సరాలు) అనే బాలుడు మృతిచెందాడు. బాలుడి తల్లి ఇమ్మురెడ్డి సుమలత స్థానిక ప్రభుత్వాసుత్రిలో తెలిపిన వివరాల మేరకు... తన ఇంటి వద్దకు ఇద్దరు వ్యక్తులు మాస్కు ధరించి ఇంటిలోకి చొరబడి తనను కొట్టగా అపస్మారకస్థితిలోకి వెళ్లానని, బాలుడు కూడా పడిపోయాడన్నారు. స్పృహ వచ్చిన తర్వాత తన కుమారుడు గగన్ను ఆస్పత్రికి చేర్చినట్లు ఆమె తెలిపింది. తనకు ముగ్గురు సంతానం అని, మృతిచెందిన బాలుడు రెండవ సంతానం. ప్రస్తుతం 8 సంవత్సరాల బాలుడు రుత్విక్, నాగశరణ్య (ఒకటిన్నర సంవత్సరం) పిల్లలు ఉన్నట్లు ఆమె తెలిపింది. కాగా, తన భర్త సునీల్కుమార్ 12 రోజుల నుంచి ఖాళీగా ఉండేవారని.. ఈరోజే కూలి పనికి వెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో బాలుడిని డాక్టర్లు పరీక్షించి ముందే చనిపోయాడని తెలియజేశారు. దీంతో బాలుడి బంధువులు ఆస్పత్రి వద్ద బోరున విలపించారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు అర్బన్ సీఐ సదాశివయ్య చేరుకుని మృతిచెందిన బాలుడిని పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇందుకు సంబందించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు. సాయంత్రం కడప నుంచి డాగ్స్క్వాడ్, క్లూస్టీం రప్పించి తనిఖీలు చేపట్టారు. ఇంటి దగ్గర ఉన్న ఓ మహిళను, తర్వాత మరో ఇద్దరిని.. మృతుని తల్లి సుమలతను విచారణ చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో పెట్టారు. కేసును త్వరగా చేధిస్తామని పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-02-13T23:29:17+05:30 IST