‘పది’ పరీక్షలు ప్రశాంతం
ABN, First Publish Date - 2023-04-03T23:40:30+05:30
జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ, జేసీ, డీఈవో
రాయచోటిలో ఒకరు డిబార్
రాయచోటి టౌన్, ఏప్రిల్ 3: జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తొలి రోజు జరిగిన పది పరీక్షలకు 22,500 మంది విద్యార్థులకుగాను 22,204 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 296 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రాయచోటి పట్టణంలోని మాసాపేట హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ డిబార్ అయ్యాడు. ఎస్పీ హర్షవర్ధన్రాజు, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఈవో పురుషోత్తంలు రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డైట్ పాఠశాల, గర్ల్స్ హైస్కూల్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. పరీక్షల సమయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాల వద్ద లేక చుట్టుపక్కల ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు పరీక్షా సమయం ముగిసేవరకు మూసివేయాలని, పరీక్షలు ముగిసేవరకు మైక్రో జిరాక్స్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి స్మార్ట్ వాచ్లు, మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్ ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలకు అనుమతి లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. మాస్ కాపీయింగ్, మాల్ప్రాక్టీస్, తదితర అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - 2023-04-03T23:40:30+05:30 IST