రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఓబుల్రెడ్డి
ABN, First Publish Date - 2023-09-01T23:31:09+05:30
సంబేపల్లె హైస్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న మార్ల ఓబుల్రెడ్డి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
సంబేపల్లె, ఆగస్టు 1: సంబేపల్లె హైస్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న మార్ల ఓబుల్రెడ్డి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ నెల 5న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.
బోధనలో మేటి..
సంబేపల్లె మండలం యర్రగుంట్లలో 1997 సంవత్సరంలో ప్రాథమిక పాఠ శాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యా యుడిగా వృత్తిలో చేరారు. అప్పటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు మండల రీసోర్స్ పర్సన్ గా సేవలందించారు. అనంత రం 2019లో పదోన్నతిపై జీవ శాస్త్ర ఉపాధ్యాయుడిగా సంబేపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో చేరి నేటి వరకు అక్కడే సేవలం దిస్తున్నారు. తమ బాధ్యతను ఏ మాత్రం విస్మరించకుండా ఏ పాఠశాలలో పనిచేస్తున్నా విద్యార్థుల అభ్యసన, సామర్థ్యాలను పెంపొందించడంలో ఈయన దిట్ట. అంతేగాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, నాడు-నేడు వంటి పథకాలు సమర్థవంతంగా విద్యార్థులకు అందేలా కృషి చేశారు. ప్రస్తుతం జిల్లా సైన్స్ అధికారిగా తనదైన శైలిలో సైన్స్ కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. సైన్స్ ఉపాధ్యాయుడిగానే కాకుండా స్కౌట్ మాస్టర్గా కూడా పనిచేస్తూ విద్యార్థుల్లో క్రమశిక్షణ సామాజిక సేవ వంటి లక్షణాలను పెంపొందిస్తుందన్నారు.
జిల్లా స్థాయి అవార్డు నుంచి..
పాఠశాలల్లో చేపట్టిన పరిశుభ్రత చర్యలు, మరుగుదొడ్లు నిర్వహణ, పచ్చదనం పెంపొదించడంలో ఈయన చేసిన కృషికి 2015 సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారాన్ని అందు కున్నారు. నేషనల్ గ్రీన్ కోర్ ఉపాధ్యా యుడిగా అదనపు బాధ్యతలు చేపట్టి పచ్చని చెట్లతో పాఠశాల కళకళలాడేలా చేశారు. ఈయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం సంబేపల్లె పాఠశాలను గ్రీన్ స్కూల్ పాఠశాలగా 2020 సంవత్సరంలో జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును ఈయన ఢిల్లీలో స్వీకరించారు. వృత్తినే దైవంగా భావించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడం, జిల్లా సైన్స్ అధికారిగా, రాష్ట్ర స్థాయి రీసోర్స్ పర్సన్గా అందించిన విశేష సేవలకు గానూ ప్రస్తుతం 2023వ సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
కుటుంబ నేపథ్యం
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం బూడిదగుంటపల్లె నందుకుల వ్యవసాయ కుటుంబంలో మార్ల ఓబుల్రెడ్డి జన్మించారు. ఈయన సతీమణి సంధ్యారాణి ప్రస్తుతం బూడిదగుంటపల్లె సర్పంచ్గా సేవలందిస్తు న్నారు. సొంత ఊరిలో ఈ దంపతులిద్దరూ దేవాలయాన్ని నిర్మించి ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలను పెంపొందించేందుకు కృషి చేశారు.
Updated Date - 2023-09-01T23:31:09+05:30 IST