దిగిరాకపోతే ఉద్యమమే
ABN, First Publish Date - 2023-03-05T03:36:29+05:30
‘ఈ ప్రభుత్వ పాలనలో చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు కూడా కోల్పోతామనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు.
మా వెనుక ఏ శక్తులూ లేవు: బొప్పరాజు
కడప (కలెక్టరేట్) మార్చి 4: ‘ఈ ప్రభుత్వ పాలనలో చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు కూడా కోల్పోతామనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. సంఘ నేతలు ఎన్నో త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న న్యాయపరమైన హక్కులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే తాము ఉద్యమబాట పట్టాల్సి వస్తోంద’ని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో భాగంగా జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు జీవన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం కడపలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో సమావేశం జరిగింది. అంతకుముందు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు. జీతాల్లో కోతలు, రాయితీల్లో కోతలు, చివరికి తినితినక తమ బిడ్డల భవిష్యత్తు కోసం తాము దాచుకున్న పొదుపు సొమ్ము ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్లకు కూడా ప్రభుత్వం లెక్కలు చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసు మ్యాటర్, పదోన్నతుల్లో కూడా అన్యాయం చేస్తోందని చెప్పారు. తాముప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. తమ ఉద్యమాల వెనుక ఏ శక్తులు లేవని తెలిపారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా సమస్యల పరిష్కారానికి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా లిఖిత పూర్వక హామీ ఇస్తే ఈనెల 9 నుంచి వచ్చేనెల 3 వరకు చేపట్టే దశలవారీ ఆందోళనలను విరమించుకుంటామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే 94 సంఘాలతో పాటు ఏపీ ఎన్జీవోలతో కలసి పోరాడతామని తేల్చి చెప్పారు.
Updated Date - 2023-03-05T03:36:29+05:30 IST