పోక్సో కేసులో నిందితునికి జీవిత ఖైదు
ABN, First Publish Date - 2023-03-14T00:42:06+05:30
తల్లీ, కూతుళ్లను హత్య చేసి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జీవిత ఖైదుతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ చిత్తూరు ఫోక్సో కోర్టు జడ్జి ఎన్.శాంతి సోమవారం తీర్పు ఇచ్చారు.
రూ.5 వేలు జరిమానా
తంబళ్లపల్లె, మార్చి 13: తల్లీ, కూతుళ్లను హత్య చేసి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జీవిత ఖైదుతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ చిత్తూరు ఫోక్సో కోర్టు జడ్జి ఎన్.శాంతి సోమవారం తీర్పు ఇచ్చారు. వివరాలిలా.. తంబళ్లపల్లె మండలం గోవిందువారిపల్లెకు చెందిన సరళమ్మ.. భర్త మరణించడంతో తన ముగ్గురు పిల్లలతో కలసి తల్లి గంగులమ్మ వద్ద అదే గ్రామంలో ఉంటోంది. గంగులమ్మకు చెందిన భూమి విషయంలో సరళమ్మ తంబళ్లపల్లె రెవెన్యూ కార్యాలయానికి వచ్చేది. ఈ క్రమంలో గంగిరెడ్డిపల్లెకు చెందిన మౌలాలితో పరిచయం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం గ్రామంలో తెలియడంతో సరళమ్మతో పాటు ముగ్గురు పిల్లలను, ఆమె తల్లిని తీసుకొని ఏటిగడ్డ తాండాలో ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఇక్కడా.. స్థానికులు సూటిపోటి మాటలు అంటుండడంతో అదే గ్రామానికి 200 మీటర్ల దూరంలో మౌలాలికి ఉన్న భూమిలో రెకుల షెడ్డు నిర్మించుకొని అందులో కాపురం పెట్టాడు. ఈ క్రమంలో సరళమ్మ తరచూ వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడేది. ఈ విషయం తెలిసిన మౌలాలి సరళను పలుమార్లు హెచ్చరించినా ఆమె పద్ధతి మార్చుకోలేదు. ఈ క్రమంలో 29 సెప్టెంబరు 2020న సరళ, మౌలాలి ఇద్దరూ వేరుశెనగ పంటకు కాపలాగా వెళ్లి అక్కడ గొడవపడ్డారు. దీంతో నిందితుడు ఆమెపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఉదయం ఇంటికి వెళ్లిన మౌలాలిని తన కూతురు ఎక్కడా అని సరళమ్మ తల్లి ప్రశ్నించడంతో ఆరోగ్యం బాగలేక మదనపల్లె ఆసుపత్రికి వెళ్లిందని ఆమెను నమ్మించాడు. మూడు రోజులైనా సరళమ్మ ఇంటికి రాకపోవడంతో గట్టిగా నిలదీసింది. దీంతో గంగులమ్మ తనపై ఎక్కడ పోలీసులకు ఫిర్యాదు చేస్తుందోనని భయపడి ఆమెను చీరతో గొంతుకు బిగించి హత్య చేశాడు. తదనంతరం సరళమ్మ పెద్ద కుమార్తెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని పిల్లలు ముగ్గురుని తీసుకుని కర్నాటకకు వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. మూడు నెలల తర్వాత సరళమ్మ బంధువులు గ్రామానికి రాగా అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో మౌలాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తంబళ్లపల్లె పోలీసుస్టేషన్లో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 2021 జనవరి 31న రిమాండ్కు పంపారు. ఈ కేసులో సయ్యద్ మౌలాలి వాదోపవాదనలు విన్న అనంతరం చిత్తూరు ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఎన్.శాంతి జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
Updated Date - 2023-03-14T00:42:06+05:30 IST