వాల్మీకుల్లో చిచ్చు పెట్టేలా బిల్లు
ABN, First Publish Date - 2023-03-25T22:59:21+05:30
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వాల్మీకుల ఎస్టీ జాబితా పునరుద్ధరణ బిల్లు అస్పష్టంగా ఉండటంతో పాటు ఏపీలోని వాల్మీకుల మధ్య ప్రాంతీయ విభేదాలు తలెత్తే విధంగా పెట్టారని ఏపీ వాల్మీకి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
రాష్ట్రమంతా ఒకేలా ఉండేలా బిల్లు పెట్టాలి
లేకుంటే ఏప్రిల్ 6న సీఎం ఇంటిని ముట్టడిస్తాం
ఏపీ వాల్మీకి సంఘం
మదనపల్లె అర్బన్, మార్చి 25: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వాల్మీకుల ఎస్టీ జాబితా పునరుద్ధరణ బిల్లు అస్పష్టంగా ఉండటంతో పాటు ఏపీలోని వాల్మీకుల మధ్య ప్రాంతీయ విభేదాలు తలెత్తే విధంగా పెట్టారని ఏపీ వాల్మీకి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక వాల్మీకులకు వ్యతిరేకంగా ఇచ్చారన్నారు. అనంతరం చంద్రబాబు పాలనలో సత్యపాల్ కమిటీ నివేదిక ద్వారా వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి కలపాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపారని, ప్రస్తుతం సీఎం జగన్ ఆనంద్కుమార్ ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ద్వారా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ బిల్లులో కేవలం చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఉంటున్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం వాల్మీకుల మనోభావాలు, ఐక్యతను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆరోపించారు. జిల్లాల వారీగా విభజన బిల్లును వెంటనే రద్దు చేసి రాష్ట్రం మొత్తంగా ఉన్న జిల్లాల వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అలా లేనిపక్షంలో ఏప్రిల్ 6న సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన ఏపీవీబీఎస్ సంఘానికి పూర్తి మద్దతు ఇచ్చి సీఎం జగన్ ఇంటి ముట్టడిలో వాల్మీకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ వాల్మీకి సంఘం ఉపాధ్యక్షుడు జయసింహ, కోశాధికారి గాది భాస్కర్, టౌన్ అధ్యక్షుడు వలసమంజు, జోలెపాళెం గీత, రెడ్డిశేఖర్, నరసింహులు, శ్రీనాథ్, రామకృష్ణ, నాగరాజ, శ్రీనివాసులు, సోము, మోహన్, కె.శ్రీనివాసులు, భాస్కర, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-25T22:59:21+05:30 IST