Chandrababu : బాబు చేసిన తప్పేమిటి?
ABN, First Publish Date - 2023-09-22T03:24:25+05:30
‘అంతా చంద్రబాబే చేశారు. నిధులు మింగేయాలన్న ఉద్దేశంతోనే స్కిల్ డెవల్పమెంట్ ప్రాజెక్టుపై అధికారులను తొందరపెట్టారు. వాళ్లమీద ఒత్తిడి తెచ్చారు’....
ఎక్కడుంది హడావిడి?.. ఎవరిమీద ఒత్తిడి?
అబద్ధాల ఆరోపణలు.. తప్పుడు కేసు
తమంతట తామే వచ్చిన సీమెన్స్, డిజైన్టెక్.. 2 సార్లు ‘స్కిల్’పై ప్రజెంటేషన్
3 మూడు సార్లు కేబినెట్లో చర్చ, ఆమోదం
8 ఎనిమిది దశల్లో స్కిల్పై నిర్ణయాలు ప్రతిపాదన వచ్చిన ఎనిమిది నెలలకు ఒప్పందం
6 ఆ తర్వాత ఆరు నెలలకు తొలి విడత నిధులు
14 మొత్తంగా 14 నెలలపాటు సాగిన ప్రక్రియ
ప్రాజెక్టు పరిశీలనకు గుజరాత్కు అధికారులు
నిధుల విడుదలకు ముందు మరోసారి పరిశీలన
ప్రాజెక్టు పర్యవేక్షణకు ఐఏఎ్సలతో కమిటీ
స్కిల్పై చంద్రబాబుది ఏకపక్ష నిర్ణయమా?
అయినా జగన్ పత్రిక రోత రాతలు
ప్రభుత్వ పెద్దల నిరాధార ఆరోపణలు
లేని స్కామ్పై సీఐడీ కేసు.. తప్పుడు వాదనలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘అంతా చంద్రబాబే చేశారు. నిధులు మింగేయాలన్న ఉద్దేశంతోనే స్కిల్ డెవల్పమెంట్ ప్రాజెక్టుపై అధికారులను తొందరపెట్టారు. వాళ్లమీద ఒత్తిడి తెచ్చారు’.... ఇది ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి జగన్ రోత పత్రిక పదేపదే చేస్తున్న ఆరోపణ! లేని స్కామ్ను ఉన్నట్లు చూపించి... చంద్రబాబు అరెస్టును సమర్థించుకునేందుకు పడుతున్న తంటాలివి. సీఐడీ ఆరోపణలు... న్యాయస్థానాల్లో వాదనలూ అన్నీ ఈ కోణంలోనే సాగుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే... 2014 నవంబరులో స్కిల్ డెవల్పమెంట్ ప్రాజెక్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇది... 2015 డిసెంబరులో దీనికి తొలి విడత నిధులు విడుదలయ్యాయి. అంటే... మధ్యలో 14 నెలల కాలం! ఆ సమయంలో స్కిల్ డెవల్పమెంట్ ప్రాజెక్టుపై ఆచితూచి అడుగు వేశారు. అన్ని నిబంధనలనూ పాటించారు. ప్రతీ నిర్ణయంలో మంత్రివర్గం, సీనియర్ అధికారుల బృందం పాత్ర ఉంది. చంద్రబాబు ఏ దశలోనూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదన్నది నిజం. మరి... ఎక్కడుంది హడావుడి? ఎవరిమీద ఒత్తిడి? దశలవారీగా ఏం జరిగిందంటే...
వాళ్లే వచ్చి అడిగారు...
‘మా రాష్ట్రంలో స్కిల్ ప్రాజెక్టు అమలు చేయండి’ అని సీమెన్స్ను కానీ, డిజైన్టెక్ను కానీ చంద్రబాబు అడగలేదు. ఆయనకు ఆ ఆలోచనే లేదు. 2014 నవంబరులో సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ కంపెనీ (సీమెన్స్ ఇండియా), డిజైన్టెక్ ప్రతినిధులు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కలిశారు. గుజరాత్లో తాము అమలుచేస్తున్న స్కిల్ ప్రాజెక్టు గురించి వివరించారు. నవ్యాంధ్రలోనూ అమలు చేస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. దీనికి చంద్రబాబు అప్పటికప్పుడు ఆమోదం తెలుపలేదు. గుజరాత్ ప్రాజెక్టును పరిశీలించాలని, ఆ తర్వాతే సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. దాదాపు నెల తర్వాత ఏపీ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులు గుజరాత్కు వెళ్లి అధ్యయనం చేశారు. గుజరాత్లో అక్కడి ప్రభుత్వ వాటా 15 శాతం, సీమెన్స్-డిజైన్టెక్ల వ్యయం 85శాతం ఉందని గుర్తించారు. దీన్ని ఏపీలోనూ అమలు చేయవచ్చని సిఫారసు చేశారు.
అందరి ముందు ప్రజెంటేషన్
‘ప్రాజెక్టు బాగుంది. మన రాష్ట్రంలోనూ అమలు చేయవచ్చు’ అని సీనియర్ ఐఏఎ్సలు చెప్పగానే చంద్రబాబు దాన్ని ఓకే చేయలేదు. 2015 ఫిబ్రవరిలో సీమెన్స్, డిజైన్టెక్ ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు. గుజరాత్లోలాగానే ఏపీలోనూ ప్రాజెక్టు అమలు చేస్తామని వివరించారు. చంద్రబాబుతోపాటు సీనియర్ ఐఏఎ్సలు, ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఈ ప్రజెంటేషన్ను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రివర్గంలో ఒకసారి...
స్కిల్ ప్రాజెక్టు ప్రతిపాదనను 2015 ఫిబ్రవరి 16న మంత్రివర్గంలో చర్చకు పెట్టారు. ప్రాజెక్టులోని ప్రతీ కీలకమైన అంశాలపై చంద్రబాబు నాటి మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
మంత్రివర్గంలో మరోసారి
2015 మార్చి 4న జరిగిన మంత్రివర్గ భేటీలో స్కిల్ ప్రాజెక్టుపై మరోసారి చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు కింద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థల ఏర్పాటు... ప్రభుత్వ వాటాగా 10 శాతం చెల్లించాలనే నిర్ణయాలను ఆమోదించారు. అంటే, ప్రభుత్వ వ్యయంపై చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, దీనికి మంత్రివర్గ ఆమోదం ఉందని స్పష్టమవుతోంది.
మంత్రివర్గంలో మూడోసారి
2015 జూన్ 30న జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్కిల్ డెవల్పమెంట్పై సీమెన్స్ ఇండియా, డిజైన్టెక్లతో స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ కుదుర్చుకునే ఒప్పందానికి ఆమోదం తెలిపారు. ఆ తర్వాతే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.
ప్రతిపాదించిన 14 నెలలకు నిధులు
ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టాలన్న ఆలోచన ఉన్నవారు ఏం చేస్తారు? త్వరగా పనయ్యేలా చూసుకుంటారు. చకచకా నిధులు విడుదల చేసి తమ వాటా సొమ్ములు కాజేస్తారు. ‘స్కిల్’ విషయంలో ఇలాంటి హడావుడి, తొందరలేనే లేదు. స్కిల్ డెవల్పమెంట్ ప్రతిపాదన తొలుత వచ్చింది 2014 నవంబరులో. ఆ తర్వాత అనేక సమావేశాలు, గుజరాత్ పర్యటన, అక్కడి ప్రాజెక్టుల పరిశీలన, పలు దఫాలుగా మంత్రివర్గంలో చర్చోపచర్చలు సాగాయి. ఇందుకు మంత్రివర్గ సమావేశాల మినిట్స్ కాపీనే తిరుగులేని సాక్ష్యాలు. అధికారుల స్థాయిలో చర్చలు జరిపి అంతా బాగుందని అధికారులు సిఫారసు చేశాకే ఒప్పదం చేసుకున్నారు. 2015 డిసెంబరులో డిజైన్టెక్కు తొలి విడత నిధులు ఇచ్చారు. అంటే, ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చి, కార్యరూపం దాల్చి నిధులు ఇవ్వడానికి 14 నెలల కాలం పట్టింది. నిధులు దోచిపెట్టాలన్న ఉద్దేశం ఉంటే ఇంత ‘జాప్యం’ జరగదని చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఇక... ఈ ప్రాజెక్టుపై 2015 జూన్లో ఒప్పందం కుదిరితే డిసెంబరులో నిధులు ఇచ్చారు. ఆ రకంగా చూసినా 6 నెలల తర్వాతే నిధుల విడుదలకు సర్కారు ఒకే చెప్పింది. సర్కారు సొమ్మును కంపెనీలకు దోచిపెట్టాలనుకుంటే ఇంత సుదీర్ఘ సమయం ఎందుకు తీసుకుంటారు?
పర్యవేక్షణకు సీనియర్లతో కమిటీలు
‘సొమ్ములు ఇచ్చేశాం. మా పనైపోయింది’ అని చంద్రబాబు ప్రభుత్వం వదిలేయలేదు. స్కిల్ డెవల్పమెంట్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీనిని పక్కాగా అమలు చేసి, ఫలితాలు సాధించేందుకు నాటి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రాజెక్టు పర్యవేక్షణకు ఒకటి, కేంద్రాల ఎంపిక కోసం మరో కమిటీని నియమించింది. పర్యవేక్షణ కమిటీలో సీనియర్ ఐఏఎ్సలు అజయ్ జైన్, ఎస్ఎస్ రావత్, ఎం.రవిచంద్ర, ఉదయలక్ష్మీతోపాటు స్కిల్డెవల్పమెంట్ విభాగ ప్రతినిధులుగా రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ, ఘంటా సుబ్బారావు ఉన్నారు. స్కిల్ డెవల్పమెంట్ కేంద్రాల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన మరో కమిటీలో ఐఏఎస్ అజయ్ జైన్, ఎస్ఎస్ రావత్, ఉదయలక్ష్మితోపాటు ఘంటా సుబ్బారావు, కె. లక్ష్మీనారాయణ సభ్యులుగా ఉన్నారు. డిజైన్టెక్కు నిధులు ఇవ్వడానికి ముందే... అంటే 2015 అక్టోబరు 5న జీఓ 8 ద్వారా ఈ కమిటీలను ఏర్పాటు చేసింది.
మరోసారి గుజరాత్కు...
ప్రాజెక్టు ప్రతిపాదన రాగానే ఒక ఐఏఎ్సల బృందం గుజరాత్కు వెళ్లి అక్కడ ‘స్కిల్’ అమలును పరిశీలించింది. ఇక... ఏపీలో ఈ ప్రాజెక్టు అమలు పర్యవేక్షణకు కమిటీని నియమించిన తర్వాత మరోసారి సీనియర్ ఐఏఎ్సలను చంద్రబాబు గుజరాత్కు పంపించారు. ఎల్.ప్రేమచంద్రారెడ్డి నేతృత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శి కె.సునీత, కె.లక్ష్మీనారాయణ, ఘంటా సుబ్బారావు తదితరులు 2015 నవంబరు 5-6 తేదీల్లో గుజరాత్లో పర్యటించి అక్కడి స్కిల్ డెవల్పమెంట్ సెంటర్లును పరిశీలించారు. పూర్తిస్థాయిలో సంతృప్తి చెంది... ‘గో అహెడ్’ అంటూ నవంబరు 7వ తేదీన నివేదిక ఇచ్చారు. ఆ తర్వాతే డిజైన్టెక్కు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నిధులను కూడా నాలుగు విడతల్లో ఇచ్చారు. ఈ కమిటీ సభ్యులు తరచూ చంద్రబాబుతో సమావేశమై ‘స్కిల్’ అమలులో పురోగతిని వివరిస్తూ వచ్చారు.
ఇక్కడ మాత్రమేనా... బాబు ఒక్కరేనా?
సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్(ఇండియా) 1997లో ఏర్పాటయింది. డిజైన్టెక్ సంస్థ 1998లో ఏర్పాటయింది. ఆ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 2200 మంది కస్టమర్లు ఉన్నారు. 2013లో గుజరాత్తో స్కిల్ ప్రాజెక్టు విజయవంతం అయ్యాకే ఆ రెండు కంపెనీలు ఏపీలో కూడా చేస్తామని ముందుకొచ్చాయి. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఈ కంపెనీలే సంయుక్తంగా ప్రాజెక్టులు చేపట్టాయి. మరి... ఇందులో చంద్రబాబు సొంత పాత్ర, సొంతంగా తీసుకున్న చొరవ ఏముంది? అసలు విషయం ఏమిటంటే... జగన్ సర్కారు స్కిల్ ప్రాజెక్టుపై ఆరోపణలు చేయడానికంటే ముందే, అంటే 2021కంటే ముందే ఒప్పందం ప్రకారం సంబంధిత ల్యాబ్లను డిజైన్టెక్ సంస్థ స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్కు పూర్తిస్థాయిలో అప్పగించింది. అవన్నీ కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. మరి... అవినీతి ఎక్కడ జరిగింది?
Updated Date - 2023-09-22T03:47:29+05:30 IST