స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేశాం
ABN, First Publish Date - 2023-03-21T03:28:15+05:30
రాష్ట్ర 5వ స్టేట్ ఫైనాన్స్ కమిష న్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
పిల్పై విచారణ మూసివేసిన ధర్మాసనం
అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర 5వ స్టేట్ ఫైనాన్స్ కమిష న్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మూడేళ్ల కాల పరిమితితో కమిషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ రత్నకుమారిని చైర్మన్గా, ఆంధ్ర యునివర్సిటీ రిటైర్డ్ రెక్టార్ ప్రొఫెసర్ ఎం. ప్రసాదరావు, పీబీ సిద్ధార్థ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ ఎంవీఎన్ పద్మారావు, పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ప్రకాశం జిల్లా మాజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాకి కృపారావులను సభ్యులుగా నియమించినట్టు తెలిపింది. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం రిటైర్డ్ కామర్స్ ప్రొఫెసర్, ప్రస్తుత సెర్ప్ డైరెక్టర్ కెవీ రమణా రెడ్డిని సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని ప్రభుత్వ జీపీ శ్రేయాస్రెడ్డి వివరించారు. వివరాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచామన్నారు. ఆ వివరాలు నమోదు చేసిన ధర్మాసనం వ్యాజ్యం పై విచారణను ముగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఆర్. రఘునందన రావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. స్టేట్ ఫైనాన్స్ కమీషన్ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ.. టీడీపీ అధికార ప్రతినిఽ ది, న్యాయవాది జి. వెంకటరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాజ్యాం గంలోని అధికరణ 243(ఐ) ప్రకారం ప్రతి రాష్ట్రానికీ ఆర్థిక సంఘం ఉండాల న్నారు. నిబంధనల మేరకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 4వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కాలపరిమితి 2020లో ముగిసి, రెండేళ్లు గడుస్తున్నప్పటికీ 5వ కమిషన్ ఏర్పాటు చేయలేదన్నారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకురాగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. పై విధంగా వివరించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్చంద్ర వాదనలు వినిపిస్తూ.. కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో వ్యాజ్యంపై విచారణను మూసివేయాలని కోరారు.
Updated Date - 2023-03-21T03:28:15+05:30 IST