పేదలకు సంక్షేమ పథకాల అమలులో వివక్ష
ABN, First Publish Date - 2023-02-23T00:37:18+05:30
పేదలకు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వివక్షత పాటిస్తుందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు.
6వ వార్డులో మహిళలతో మాట్లాడుతున్న నరేంద్రకుమార్
పొన్నూరుటౌన్, ఫిబ్రవరి 22 : పేదలకు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వివక్షత పాటిస్తుందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. పట్టణంలోని ఆరో వార్డులో బుధవారం ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది. ఈ సందర్భంగా వార్డులో విస్తృతంగా పర్యటించిన నరేంద్రకుమార్ పలు వర్గాల ప్రజలను కలుసుకుని వారి బాధలను ఆలకించారు. పలువురు వృద్ధులు మాట్లాడుతూ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి తమ పెన్షన్లు తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఏ వార్డులో పర్యటించినా ప్రజలు ప్రభుత్వ వివక్షత గురించి వాపోతున్నారన్నారు. ప్రధానంగా కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయని, పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇల్లు ఉందని పెన్షన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మరణిస్తే ఒంటరి వ్యక్తులకు రేషన్ కార్డు ఇవ్వమని పెద్ద ఎత్తున తొలగించారన్నారు. ఇలా కార్డులు తొలగించడం వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వారు దూరమయ్యారన్నారు. ఎన్నికల ముందు పేదల కోసం తెలుగుదేశం పార్టీ ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి అర్హులకు యంత్ర పరికరాలను మంజూరు చేసిందన్నారు. ఆ పరికరాలను సైతం పంచిపెట్టకుండా నాలుగేళ్లుగా ప్రభుత్వం కాలాయాపన చేసి వాటిని పనికి రాకుండా యార్డుల్లో మూలన పడేసిందన్నారు. అలాగే జిల్లా పరిషత్ హైస్కూల్లో పేద విద్యార్థుల కోసం సైకిళ్లను అందజేస్తే వాటిని కూడా పంచి పెట్టకుండా పనికి రాకుండా చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పేదలందరికీ సన్న బియ్యం ఇస్తామని ప్రకటించారన్నారు. నాలుగేళ్లయినప్పటికీ సన్న బియ్యం సంగతేమోకానీ ప్రభుత్వ రేషన్ షాపుల్లో తినడానికి పనికి రాని ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - 2023-02-23T00:37:24+05:30 IST