Bandi Srinivasa Rao: బండికి బంపర్ ఆఫర్?
ABN, First Publish Date - 2023-06-13T02:48:50+05:30
ఉద్యోగ నేత బండి శ్రీనివాసరావుకు ప్రభుత్వ పెద్దలు బ్రెయిన్ వాష్ చేశారని తెలుస్తోంది. అందుకనే ఆయన ఆహా.. ఓహో.. అదుర్స్ అంటూ ఉద్యోగుల్లో అప్రతిష్ఠను మూటగట్టుకున్న జగన్ విధానాలను సైతం తెగ పొగిడేస్తున్నారన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో మొదలైంది. ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వంలో బండికి పదవి కట్టబెట్టబోతున్నారని ఈ వర్గాలు చెబుతున్నాయి.
ఎందుకు.. ఏమిటి.. ఎలా?
అందుకేనా.. జగన్కు ఉద్యోగ నేత భజన
ఇప్పటికే పెద్దలతో ఒప్పందం కుదిరిందా?
ఒకవైపు ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు
మరోవైపు సర్కారుకు పదేపదే కితాబులు
రాష్ట్ర ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికర చర్చ
(అమరావతి, ఆంధ్రజ్యోతి): ఉద్యోగ నేత బండి శ్రీనివాసరావుకు ప్రభుత్వ పెద్దలు బ్రెయిన్ వాష్ చేశారని తెలుస్తోంది. అందుకనే ఆయన ఆహా.. ఓహో.. అదుర్స్ అంటూ ఉద్యోగుల్లో అప్రతిష్ఠను మూటగట్టుకున్న జగన్ విధానాలను సైతం తెగ పొగిడేస్తున్నారన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో మొదలైంది. ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వంలో బండికి పదవి కట్టబెట్టబోతున్నారని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగ నేత చంద్రశేఖరరెడ్డికి ఇచ్చినట్టే కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ పదవి ఇవ్వాలని బండి కోరగా, ప్రభుత్వ పెద్దలు సమ్మతించినట్టు సమాచారం. సీఎంతో ఉద్యోగ నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. పోటీలు పడి జగన్ను ఈ సమావేశంలో ఉద్యోగ నేతలు పొగిడేశారు. అయితే, మిగతా నేతల కంటే ఒక ఆకు ఎక్కువ చదివినట్టు బండి ఏకంగా భజనే చేశారు. అయితే, ఈ భేటీకి ముందే పదవి విషయంలో ప్రభుత్వ పెద్దలతో ఆయనకు ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. ‘అందుకేనా జగన్ భజన’ అంటూ ఉద్యోగ వర్గాలు విస్తుపోతున్నాయి.
ఇంత దిగ..జారుడా?
బండి శ్రీనివాసరావు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో పదవీవిరమణ చేయనున్నారు. పదవీ విరమణ చేసిన అనంతరం ఆయన విశ్రాంత ఉద్యోగి అవుతారు. దీంతో ఏపీఎన్జీవో, ఏపీ జేఏసీ అధ్యక్ష స్థానాలు కోల్పోతారు. అంటే ఆయనకు ఎలాంటి పదవీ ఉండదు. అందుకే పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఏదో ఒక పదవిలో కొనసాగేలా స్కెచ్ వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనకు కూడా ఏపీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డికి ఇచ్చినట్లుగానే క్యాబినెట్ ర్యాంకుతో కార్పొరేషన్ చైర్మన్ లేక సలహాదారు, లేదా మరేదైనా పదవి ఇవ్వాలని ప్రభుత్వ పెద్ద చుట్టూ తిరుగుతూ అవకాశం వచ్చినప్పుడల్లా .... ‘నా సంగతి ఏం చేశా’రని ఆయన అడుగుతున్నట్లు పలువురు సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. బండి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ లక్షలాది మంది ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టుపెట్టినందుకు ప్రతిఫలంగా.... ‘చేద్దాంలే’ అనే భరోసా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న సలహాదారు నుంచి బండికి హామీ లభించినట్లు తెలిసింది. దీంతో అవకాశం దొరిగినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారని పలువురు ఆ సంఘంలోని సీనియర్ సభ్యుల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ తమ సంఘ నేతలు ఇంతలా దిగజారిన సందర్భాలు లేవని మండిపడుతున్నారు.
ఆ నిబంధన తొలగింపుతో...
ఏపీ ఎన్జీవో సంఘానికి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ముందుగా తాలూకా స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎన్నికలు జరిపి.. చివరిగా రాష్ట్ర స్థాయి ఎన్నికలు నిర్వహిస్తారు. 280 తాలూకా యూనిట్లలోని ప్రెసిడెంట్, సెక్రటరీ, జిల్లా ఆఫీస్ బేరర్లు కలిపి జిల్లాకు 15 మంది ఉంటారు. అమరావతి క్యాపిటల్ సిటీ యూనిట్ ఉంది. వీరందరూ కలిసి రాష్ట్ర ఎన్నికల ఓటర్ లిస్ట్లో ఓటర్లుగా ఉంటారు. వీరితోపాటు రాష్ట్ర ఆఫీస్ బేరర్లు కార్యవర్గ సభ్యులుగా ఉం టారు. అందరూ కలిసి రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి. అయితే గతంలో ఈ సంఘానికి ఎన్నికలు జరిగేవి. సం ఘ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికీ రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గంలోని ఏ పోస్టులకు అయినా పోటీ చేసే అర్హత ఉండేది. అయితే 2016లో సంఘ యాక్ట్లో సవరణ తెచ్చారు. సంఘం జిల్లా ప్రెసిడెండ్గా చేస్తేనే రాష్ట్ర అధ్యక్ష స్ధానానికి పోటీ చేయాలని నిబంధనలను మార్చారు. ఇక..జనరల్ సెక్రటరీగా పోటీ చేయాలంటే జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శిగా పోటీ చేసి ఉండాలి. రాష్ట్ర ఆఫీ్సబేరర్గా పోటీ చేయాలంటే జిల్లా స్థాయిలో ఆఫీస్ బేరర్గా పని చేయాలనే నిబంధన తీసుకొచ్చారు. దీంతో అప్పటి నుంచి సంఘానికి ఎన్నికలు జరగడం ఆగిపోయింది. ఏకగ్రీవాల పరంపర కొనసాగుతోంది. పోటీ ప్రక్రియ లేకుండా పోయింది. అప్పటినుంచి రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వారి మధ్యనే ముఖ్యమైన పదవులు మారుతూ వచ్చాయి. జనవరి 18, 2023లో విజయవాడలో ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. అది కూడా పోటీ లేకుండా ఏకగ్రీవం చేశారు. బండి శ్రీనివాసరావు అధ్యక్షుడుగా మరోసారి ఎన్నికయ్యారు. అదేవిధంగా ఏపీ జేఏసీకి కూడా బండి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Updated Date - 2023-06-13T02:49:00+05:30 IST