అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అక్రమ లే ఔట్లు
ABN, First Publish Date - 2023-06-26T00:44:14+05:30
గుంటూరు నగర శివారు ప్రాంతాలు, గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు వెలుస్తోన్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు రియల్ వ్యాపారులు అనధికార వెంచర్లతో ప్లాట్లు విక్రయిస్తూ జేబులు నింపకుంటున్నారు.
గుంటూరు, జూన్ 25: గుంటూరు నగర శివారు ప్రాంతాలు, గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు వెలుస్తోన్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు రియల్ వ్యాపారులు అనధికార వెంచర్లతో ప్లాట్లు విక్రయిస్తూ జేబులు నింపకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం అనధికార వెంచర్ల పని పట్టేందుకు నగరపాలక అధికారులు వెళ్ళారు. వెళ్ళిన అధికారులపైకి రియల్ వ్యాపారులు ఎదురుతిరగడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మేము ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చామని, లేఅవుట్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని రియల్ వ్యాపారులు ఎదురుతిరిగారు. వారి నుంచి మామూళ్లు మెక్కిన నేతలు వాటి జోలికి వెళ్లవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని సమాచారం. ఎటువంటి కన్వెర్షన్ లేకుండా, సీఆర్డీఏ, నగరపాలక సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండానే కొందరు వెంచర్లు వేస్తున్నారు. పక్కా ప్లాన్లు అంటూ కొనుగోలుదారులను మోసం చేస్తూ అంటగడుతున్నారు. నగరానికి ఆనుకొని ఉంటోన్న ఈ ప్లాట్లు చదరపు గజం రూ.8 వేల నుంచి రూ.12 వేల లోపు విక్రయిస్తుండటంతో కొనుగోలుకు అత్యధిక శాతం మంది ఆసక్తి చూపుతోన్నారు. అధికారులకు అక్రమ లేఅవుట్ల విషయం తెలిసినా చర్యలకు వెనుకాడుతున్నారన్న విమర్శలున్నాయి. అక్రమ లే అవుట్లతో నగరపాలక సంస్థ, సీఆర్డీఏ ఖజానాకు రావాల్సిన పన్ను పెద్ద మొత్తంలో నష్టం కలుగుతోంది. ఇక కొందరు రియల్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి గుంటూరు నగర శివారులోని లాలుపురం పరిసర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు వెలిసినట్లు సమాచారం. నగరానికి చెందిన ఓ ముఖ్య నేతకు రూ.లక్షల్లోనే మామూళ్ళు ముట్టచెప్పినట్లు సమాచారం. పాతగుంటూరు శివారులో కూడా అనధికార వెంచర్పై కన్నేసిన ముఖ్య నేత తన వద్ద ఉండే నేతతో పాటు పాతగుంటూరులోని ఓ నాయకుడి ద్వారా రూ. లక్షల్లో లాగినట్లు సమాచారం. చుట్టుగుంటకు చెందిన అధికార పార్టీకి చెందిన డివిజన్ స్థాయి నాయకుడు కూడా అనధికార వెంచర్ల వ్యవహారంలో అక్రమ వసూళ్లతో జేబులు నింపుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ఆయన డివిజన్ కాకుండా పక్క డివిజన్లతో పాటు అక్రమ వెంచర్ల వ్యవహారంలోనూ తల దూర్చుతూ సంపాదనకు అలవాటుపడ్డాడన్న ఆరోపణలున్నాయి.
ఎదురు తిరుగుతోన్న రియల్ వ్యాపారులు....
మామూళ్లు ముట్టచెప్పిన రియల్ వ్యాపారులు నగరపాలక సంస్థ అధికారులకు ఎదురు తిరిగేందుకు వెనుకాడటం లేదు. ఇటీవల లాలుపురం శివారులో ఓ డివిజన్ స్థాయి నాయకుడు సూచనల మేరకు వెళ్ళిన జీఎంసీ సిబ్బందికి రియల్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూళ్ళు ఇచ్చామని, తమ వెంచర్పై చర్యలు తీసుకుంటే మిగతా వెంచర్లపై కూడా చర్యలు తీసుకోవాలని లేకుంటే సహించేదిలేదని హెచ్చరికలు చేశారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిసింది. దీంతో ముఖ్య నేతకు సంబంధించిన వ్యవహారం కావటంతో చేసేది లేక జీఎంసీ సిబ్బంది వెనుతిరిగారు.
Updated Date - 2023-06-26T00:44:14+05:30 IST