రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశారు
ABN, First Publish Date - 2023-09-04T23:35:06+05:30
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిందని రైతులు, మహిళలు పేర్కొన్నారు. బి
తుళ్లూరు(తాడికొండ), సెప్టెంబరు 4: వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిందని రైతులు, మహిళలు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట రాజధాని గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు, మహిళలు చేపట్టిన నిరసనలు సోమవారం 1,357వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఇందులో భాగంగానే మంగళగిరి వద్ద 200 ఎకరాల్లో ఎయిమ్స్ను ఏర్పాటుచేసి వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాల కోసం అమరావతిలో భూములు కొనుగోలు చేశాయని తెలిపారు. రాజధానిని మార్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం వేసే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. రాజఽధానిని మార్చితే న్యాయస్థానాలు కూడా ప్రశ్నిస్తాయని అన్నారు. ఇప్పటికే రాజధానిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పులు వెల్లడించిందన్నారు. రాజధాని 29 గ్రామాలతో పాటు తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.
Updated Date - 2023-09-04T23:35:06+05:30 IST