తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా అంకురార్పణ
ABN, First Publish Date - 2023-10-15T03:54:25+05:30
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
తిరుమల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆదివారం నుంచి తొమ్మిదిరోజుల పాటు అలంకార ఉత్సవాలను వైదికంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తకోటికి కనువిందు చేసేలా తిరుమలను విద్యుత్, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడు శనివారం రాత్రి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. అనంతరం పడమరగా ఉన్న వసంత మండపానికి వేంచేశారు. అక్కడ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పుట్టమన్నును సేకరించి నవపాలికలలో ఉంచుకుని మిగిలిన మాడవీధుల్లో ప్రదక్షిణగా ఆలయానికి వేంచేశారు. యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించి పాలికలలోని పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపచేసే ప్రక్రియను వైదికంగా నిర్వహించారు. దీంతో స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లయింది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం బంగారు తిరుచ్చిపై, రాత్రి పెద్ద శేషవాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.
Updated Date - 2023-10-15T03:54:25+05:30 IST