పకడ్బందీగా ఫేస్ రికగ్నిషన్ హాజరు
ABN, First Publish Date - 2023-10-11T03:40:06+05:30
ఉద్యోగులందరికీ ఫేస్ రికగ్నిషన్ ఆధారిత హాజరు నమోదును పకడ్బందీగా అమలు చేయాలని సాధారణ పరిపాలనశాఖ పొలిటికల్ విభాగం ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు ఆదేశాలు జారీచేశారు.
సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులందరికీ ఫేస్ రికగ్నిషన్ ఆధారిత హాజరు నమోదును పకడ్బందీగా అమలు చేయాలని సాధారణ పరిపాలనశాఖ పొలిటికల్ విభాగం ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఫేస్ రికగ్నిషన్ హాజరు అమలుకు సంబంధించి కొన్ని సూచనలు చేస్తూ మోమో విడుదల చేశారు. పలు కార్యాలయాల్లో ఇప్పటికీ ఉద్యోగులందరూ ఏపీ-ఎ్ఫఆర్ఎస్ యాప్లో నమోదు కాలేదని గుర్తించామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 45 నుంచి 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఏపీ ఎఫ్ఆర్ఎస్ యాప్లో తమ హాజరును నమోదు చేస్తున్నారని, కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫేస్ రికగ్నిషన్ హాజరు అమలు పూర్తి స్థాయిలో జరగడంలేదని చెప్పారు. చాలా మంది ఉద్యోగులు ఉదయం విధులకు హాజరైనప్పుడు మాత్రమే (చెక్ఇన్) ఫేస్ హాజరు వేస్తున్నారని, కార్యాలయం నుంచి బయలుదేరే సమయంలో (చెక్ అవుట్) నమోదు చేయడంలేదని గమనించినట్లు పేర్కొన్నారు. సచివాలయంలోని అన్ని శాఖల విభాగాధిపతులు, హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులందరూ 100శాతం ఫేస్ యాప్లో హాజరును కచ్చితంగా నమోదుచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Updated Date - 2023-10-11T03:40:06+05:30 IST