దిగిరాని అల్లం
ABN, First Publish Date - 2023-06-01T01:28:45+05:30
అల్లం నేలకు దిగిరానంటోంది. బహిరంగ మార్కెట్లో ఏకంగా కిలో రూ.300కు పైగా ధర పలుకుతోంది. పావు కిలో అల్లం రూ.70 నుంచి రూ. 80కు విక్రయిస్తున్నారంటే అల్లానికి ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది.
కిలో రూ.300 పైనే .... పావుకిలో రూ.80
హోటళ్లలో అల్లం టీ, అల్లం పచ్చడి ఊసేలేదు
రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు
ఉష్ణోగ్రతలు పెరగడంతో తగ్గుతున్న దిగుబడులు
రాజమహేంద్రవరం అర్బన్, మే31: అల్లం నేలకు దిగిరానంటోంది. బహిరంగ మార్కెట్లో ఏకంగా కిలో రూ.300కు పైగా ధర పలుకుతోంది. పావు కిలో అల్లం రూ.70 నుంచి రూ. 80కు విక్రయిస్తున్నారంటే అల్లానికి ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. రైతుబజార్లలోనూ దీని ధర ఎక్కువగానే ఉంది. ఇక్కడ కిలో రూ.190 వరకు అమ్ముతున్నారు. అల్లం ప్రియంగా మారడంతో ప్రజలు చిన్నముక్క కొనడానికి కూడా జంకుతున్నారు. 100 గ్రాములకు రూ.35 తీసుకుని చిన్న ముక్క చేతిలో పెడుతున్నారు. అటు హోటళ్లలో అల్లం టీ, అల్లం పచ్చడి మాట దాదాపుగా మరిచిపోయారు. కొసరుగానో.. రూ.10, రూ.20కు అల్లం ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయని వ్యాపారులు జోక్ చేస్తుండడం గమనార్హం. వాస్తవానికి మన రాష్ట్రంలో అల్లం సాగు చేసే వాతావరణ పరిస్థితులు చాలా తక్కువ. విశాఖ ఏజెన్సీలోని ఎస్.కోట, పాడేరు, అరకు వంటి ఘాటీ ప్రాంతాల్లో చాలా తక్కువ విస్తీర్ణంలో అల్లం సాగు చేస్తుంటారు. ఇది కూడా సీజన్లోనే దొరుకుతుంది. దీనివల్ల ఇక్కడి అల్లం మన వినియోగ అవసరాలకు ఏ మాత్రం చాలదు. ఒడిశా ప్రాంతంలోని ఘాటీల నుంచి కూడా అల్లం కొంతవరకూ వస్తున్నా అది కూడా తక్కువే. దీంతో అల్లం వ్యాపారులంతా కర్నాటక రాష్ట్రంలోని మెట్టుపాలెం అల్లంపైనే ఎక్కువగా ఆధారపడతారు. స్థానికంగా సాగు లేకపోవడం మెట్టుపాలెం నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకోవడం తో డిమాండ్ పెరిగి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ప్రధానంగా ఈ సీజన్లో సొంఠి కోసం పంటను పక్కన పెట్టడం మరో కారణం.
Updated Date - 2023-06-01T01:28:45+05:30 IST