చోటుంటుందా..
ABN, First Publish Date - 2023-08-22T01:04:06+05:30
టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ఈదఫా చోటు దక్కించుకోవడంకోసం రకరకా ల పావులు కదుపుతున్నారు. అధిష్ఠానం ఆశీస్సులకోసం కీలక నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బోర్డు సభ్యత్వం ఇప్పుడు దక్కించుకోకపోతే ఆ తర్వాత ఇక వరించదేమోననే అంచనాలతో అడుగులు వేస్తున్నారు.
-టీటీడీబోర్డులో చోటు కోసం పలువురు జిల్లా ఎమ్మెల్యేల ఆశలు
-అధిష్ఠానం ఆశీస్సుల కోసం కీలకనేతల చుట్టూ ప్రదక్షిణలు
-ఈదఫా ఎలాగైనా ఛాన్స్ కొట్టాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రయత్నాలు
-గత బోర్డు నియామకం సమయంలో సభ్యత్వం ఆశించి భంగపాటు
-అటు మంత్రి పదవిపోయినా ఆతర్వాత కన్నబాబుకు ఏపదవి లభించని వైనం
-మాజీ మంత్రులను కొత్త ప్రాంతీయ బోర్డులకు ఛైర్మన్లు చేస్తారని అప్పట్లో ప్రచారం
-తీరా ఆపదవుల ఊసే లేకపోవడంతో ఉసూరు: ఇప్పుడైనా పరిగణనలోకి తీసుకుంటారని ఆశ
-గతేడాది మంత్రిపదవి రేసులో భంగపడ్డ పెండెం దొరబాబులో సైతం బోర్డు ఆశలు
-ఉన్న తక్కువ సమయంలోనైనా ఛాన్స్ వస్తుందేమోనని మరికొందరు ఎమ్మెల్యేల లెక్కలు
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ఈదఫా చోటు దక్కించుకోవడంకోసం రకరకా ల పావులు కదుపుతున్నారు. అధిష్ఠానం ఆశీస్సులకోసం కీలక నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బోర్డు సభ్యత్వం ఇప్పుడు దక్కించుకోకపోతే ఆ తర్వాత ఇక వరించదేమోననే అంచనాలతో అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత జగన్ సర్కారు పదవీ కాలం ఇంకా కొన్ని నెలలే ఉండడంతో ఉన్న తక్కువ వ్యవధిలోనైనా బోర్డు మెంబర్గా పనిచేశామని అనిపించుకోవడంకోసం తెగ పైరవీలు చేస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఈసారి ఎలాగైనా ఛాన్స్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. గతంలో బోర్డు నియామకంలో తనకు అవకాశం వస్తుందని ఎదురు చూడగా భంగపాటే ఎదురైంది. దీంతో ఈసారి ఎలాగైనా చోటు దక్కించుకోవాలనే పట్టుదలతో తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత కన్నబాబుకు జగన్ చేయిచ్చారు. తీసేసిన పదవి స్థానంలో ప్రాంతీయ బోర్డు చైర్మన్ హోదా వస్తుందని ఆశించగా జగన్ సర్కారు ఆ పదవుల జోలికే వెళ్లలేదు. దీంతో ఆయన కూడా ఇప్పుడు తనకు అవకాశం ఇస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నారు. గతేడాది మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పెండెం దొరబాబు సైతం కాపు కోటాలో ఈసారైనా అధిష్ఠానం న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. వీరు కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం బోర్డు సభ్యుడిగా తమను ఏకోశాన్నైనా పరిగణనలోకి తీసుకుంటారేమోననే ఆశతో ఉన్నారు.
అవకాశం వరిస్తుందా?
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్బోర్డు పదవీ కాలం పూర్తవడంతో జగన్ సర్కారు తిరిగి కొత్త బోర్డును నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. చైర్మన్ పదవీకాలం పూర్తవడంతో ఇటీవల కొత్త చైర్మన్గా భూమన కరుణాకరరెడ్డిని నియ మించిన ప్రభుత్వం బోర్డు సభ్యుల నియామకంపై ఇంకా కసరత్తు కొనసాగిస్తోంది. అసలే అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వానికి ఇంకా కొన్నినెలలే వ్యవధి ఉంది. దీంతో ఉన్న తక్కువ వ్యవధిలో ఎవరెవరిని బోర్డులో నిం పాలనే దానిపై సామాజిక సమీకరణాలపై విశ్లేషించుకుంటోంది. ఇప్పుడు నియమించబోయే కొత్త బోర్డులో సభ్యులకు రెండేళ్ల పదవీ కాలం కాగా, ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు జరి గి ఒకవేళ ప్రభుత్వం మారితే బోర్డు మొత్తం రద్దు కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎవరికి ఛాన్స్ వచ్చినా నెలల వ్యవధిలోనే పదవికి గండం పొంచి ఉంది. ఈనేపథ్యంలో ఉన్న తక్కువ సమయంలోనైనా బోర్డుమెంబర్గా పనిచేస్తే చాలనే భావనతో జిల్లాలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారితే అప్పుడు ఎలా గూ అవకాశం ఉండదనే భావనతో చేస్తే ఇప్పుడే బోర్డు సభ్యుడిగా చేయాలని పట్టు దలతో ఉన్నారు. దీంతో ఛాన్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే పార్టీ జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త మిథున్రెడ్డి ద్వారా రాయ బేరాలు నడుపుతున్నారు. ముఖ్యంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఈదఫా ఎలాగైనా బోర్డు సభ్యత్వం తెచ్చుకోవాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నారు. వాస్తవానికి టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేయాలని ఆయన ఎప్పటినుంచో పట్టు దలతో ఉన్నారు. గత బోర్డు నియామకం సమయంలోను ఛాన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. జగన్ వద్ద కూడా తన కోరికను బయటపెట్టారు. కానీ వైసీపీ అధిష్ఠానం ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కొంత నిరాశ చెందా రు. ఈసారి చివరి బోర్డు నియామకం జరుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా బోర్డు మెంబర్ అయితీరాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నినెలల కిందట జగన్ను కలిసినప్పుడు సైతం తన కోరిక ను మరోసారి ఆయన ముందు ఉంచినట్లు తెలిసింది. రెడ్డి సామా జికవర్గ కోటాలో తనకు అమాత్య పదవి ఎలాగూ ఇవ్వడం కుదర దు కాబట్టి ఈసారికి తనకు బో ర్డులో చోటు కల్పించాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
ఎమ్మెల్యేల్లో ఆశలు
మాజీమంత్రి కన్నబాబు సైతం ప్రయత్నాలు పెద్దగా చే యకపోయినా తనకు ఆకస్మికంగా అవకాశం వస్తుందేమో అనే ఆశ తో ఉన్నారు. గతేడాది ఏప్రిల్లో మంత్రి పదవి నుంచి తనను తప్పించినప్పుడు తిరిగి కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ మండళ్లలో ఒక దానికి క్యాబినేట్ ర్యాంకుతో చైర్మన్ హోదా వస్తుం దని ఆశపడ్డారు. అటు జగన్ కూ డా అమాత్య పదవులు పోయిన వారికి ఈ పదవులు ఇస్తామని నమ్మబలికారు. తీరా ఆ తర్వాత ఆ ఊసే మర్చిపో వడంతో కన్నబాబుకు రిక్తహస్తం మిగిలింది. ఆ తర్వాత ఆయనకు కాపు సామాజి కవర్గ కోటాలో జిల్లా వైసీపీ అధ్యక్షుడి పదవి ఇచ్చి సరిపెట్టారు. ఈ నేపథ్యంలో పద వీ త్యాగం చేసినందుకు తనకు ఛాన్స్ ఇస్తారే మోననే ఆశతో ఉన్నారు. పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం తనకు బోర్డు మెంబర్ పదవి వరిస్తుం దని భావిస్తున్నారు. ఇంతవరకు తనకు పార్టీ నుంచి ఏ పదవీ లేనందున ఈసారికి అయినా బోర్డు సభ్యుడి ఛాన్స్ ఇస్తారనే ఆశతో ఉన్నారు. గతేడాది మంత్రివర్గ విస్తరణలో కన్నబాబును తప్పించిన తర్వాత అదే సామాజికవర్గ కోటా కింద పదవి వరిస్తుందని భావించారు. తీరా దాడిశెట్టి రాజా మంత్రి పదవి ఎగరేసుకుపోయారు. దీంతో అప్పట్లో ఆయన కొంత అలక వహించారు. ఈ నేపథ్యంలో తక్కువ వ్యవధే ఉన్నా తనకు ఈసారైనా బోర్డు సభ్యత్వంతో పార్టీ న్యాయం చేస్తుందని నమ్ము తున్నారు. కాగా కాకినాడ జిల్లా నుంచి ఒకరు లేదా ఇద్దరికి ఈసారి బోర్డులో చోటుంటుందనే ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎమ్మెల్యేల్లో ఎవరికి అవకాశం ఉంటుందోనని వైసీపీ నేతలు ఎవరికివారే అంచనాలు వేసుకుంటున్నారు. అలా కాకుండా ఒకరికే ఛాన్స్ ఇస్తే అందులో జగన్కు సన్నిహితంగా ఉంటున్న ఓ నేతకు బోర్డు సభ్యత్వం ఖాయమని చెబుతున్నారు.
మల్లాడికి రెండోసారి ఇస్తారా?
యానాంనుంచి మల్లాడి కృష్ణారావు టీటీడీ బోర్డు సభ్యుడి పదవి ఇటీవల ముగిసింది. ఆయనకు మరోసారి కొనసాగింపుపై అస్పష్టత కొనసాగుతోంది. ఈసారి ఆయనకు బదులు పక్కనే అదే సామాజికవర్గం నుంచి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కు చాన్స్ ఇస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. గతేడాది మంత్రివర్గ విస్తరణలో దాదాపు పదవి ఖాయమై చివర్లో చేజారింది. దీంతో ఆయనకు అవకాశం ఉంటుందని అంచనాలు నెలకొన్నాయి. ద్వారంపూ డికి-మల్లాడికి ఇటీవల కాకినాడలో బీసీ సమావేశం నిర్వహణ విషయంలో విభే దాలు నెలకొన్నాయి. ద్వారంపూడి కావాలని తమ సమావేశాన్ని అడ్డుకున్నారని మల్లాడి వర్గం జగన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో మల్లాడితో తన కున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ఆయనకు రెండోసారి కొనసాగింపునకు ద్వారంపూడి అడ్డుపుల్ల వేసి ఆస్థానంలో పొన్నాడకు ఇప్పించేందుకు ప్రయ త్నిస్తున్నట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది. సీఎం జగన్ వీటిని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా మల్లాడితో తనకున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రెండోసారి అవకాశం ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది.
Updated Date - 2023-08-22T01:04:06+05:30 IST