ఎడతెరిపి లేని వాన
ABN, First Publish Date - 2023-07-21T00:58:55+05:30
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా ముసురు వీడలేదు. గురువారం తెల్లవారుజాము నుంచి కొవ్వూరు పట్టణ, మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమయిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది.
లోతట్టు ప్రాంతాలు, రహదారి గోతుల్లో వర్షపు నీరు
ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజానీకం
వెలవెలబోయిన వ్యాపార సంస్థలు
కొవ్వూరు, జూలై 20: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా ముసురు వీడలేదు. గురువారం తెల్లవారుజాము నుంచి కొవ్వూరు పట్టణ, మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమయిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దీంతో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా జన జీవనం స్తంభించి వ్యాపార సంస్థలు వెలవెలబోతున్నాయి. లోతట్టు ప్రాంతాలతో పాటు, రహదారి గోతుల్లో వర్షపు నీరు నిలిచి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం వచ్చి రెండునెలలు కావస్తున్నా ఇప్పటివరకు సరైన వర్షాలు కురవక నిరుత్సాహం చెందిన రైతులకు మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో ఊరట పొందడంతోపాటు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వర్షాలు సాగుకు అవసరమైనప్పటికి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపునీరు ఎగదన్ని పంటపొలాల్లో నిలిచి నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరు మండలం నందమూరు జంక్షన్ నుంచి పశివేదల వెళ్లే రహదారిలో జగనన్న కాలనీ వద్ద వర్షపునీరు రోడ్లపై ప్రవహించడంతో ద్విచక్ర వాహనదారులు రహదారి గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. కాలువలో గుర్రపుడెక్క పెరిగిపోవడం, కాలువలకు అడ్డుకట్టలు వేయడంతో నీరు ముందుకు పారక పంట పొలాలు ముంపుకు గురయ్యాయి.
Updated Date - 2023-07-21T00:58:55+05:30 IST