ఆస్పత్రికి వచ్చిన రోగులను మందులు బయట కొనుక్కోమనడం నేరం
ABN, First Publish Date - 2023-09-22T00:57:39+05:30
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులను మందులు బయట కొనుక్కోమనడం నేరమని, ఆసుపత్రిలో ఎప్పుడూ పూర్తి స్థాయిలో మందులు ఉండాలని ఏడీఎంహెచ్వో జి.ప్రకాశం వైద్యులకు సూచించారు.
ఆస్పత్రులను తనిఖీ చేసిన ఏడీఎంహెచ్వో ప్రకాశం
రాజవొమ్మంగి, సెప్టెంబరు 21: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులను మందులు బయట కొనుక్కోమనడం నేరమని, ఆసుపత్రిలో ఎప్పుడూ పూర్తి స్థాయిలో మందులు ఉండాలని ఏడీఎంహెచ్వో జి.ప్రకాశం వైద్యులకు సూచించారు. రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రిలో గత మంగళవారం 12 గంటల వరకు వైద్యులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బుధవారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రిని ఏడీఎంహెచ్ఓ ప్రకాశం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఆ రోజు ఇబ్బందులకు గురైన రోగుల వివరాలు తెలుసుకున్నారు. మండలంలోని జడ్డంగి, రాజవొమ్మంగి ప్రభుత్వ ఆస్పత్రులను ఏడీఎంహెచ్వో తనిఖీ చేసి ఆసుపత్రిలోని వార్డులను, ల్యాబ్లను, మందులు ఇచ్చే గదులను ఆయన తనిఖీ చేశారు. ప్రసూతి వార్డులలో ఫ్యాన్ తిరగకపోవడంపై వెంటనే మరమ్మతులు చేయించాలని, వేడి నీళ్లకు గ్రీజర్ ఏర్పాటు చేయాలని వైద్యులకు సూచించారు. అనంతరం రాజవొమ్మంగి వైద్యాధికారులతో ఏడీఎంహెచ్వో ప్రకాశం మాట్లాడుతూ ఆసుపత్రులలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రిలో అవసరాల కోసం హెచ్డీఎస్ నిధులు వినియోగించాలని, మందులు లేకపోతే ఆ నిధులతో మందులు కొనుగోలు చేయవచ్చునని ఆయన స్పష్టం చేశారు. రోగులకు బయట మందులు రాస్తే అవి దొరకక ఇబ్బంది పడతారని అలా ఎప్పుడు చేయవద్దని అన్నారు. గిరిజన ప్రాంత ఆసుపత్రిలో సేవలు మైదాన ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని, పరికరాలు ఉన్నా పూర్తి స్థాయిలో వినియోగంలో లేవని, డివిజన్ మొత్తంగా ఉన్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడతామని ఏడీఎంహెచ్వో తెలిపారు. ఆయనతో రాజవొమ్మంగి వైద్యాధికారులు ఉషశ్రీ, లిఖిత, లాగరాయి వైద్యాధికారి రవీంద్ర ఉన్నారు.
Updated Date - 2023-09-22T00:57:39+05:30 IST