కర్రి పద్మశ్రీ ఎంపికపై అసంతృప్తి జ్వాలలు
ABN, First Publish Date - 2023-02-21T03:13:41+05:30
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి పొందిన కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్తో ఉన్న సంబంధాలే కలిసొచ్చాయని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కాకినాడ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి పొందిన కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్తో ఉన్న సంబంధాలే కలిసొచ్చాయని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త నారాయణరావు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పద్మశ్రీ మాత్రం ఏరోజూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఐదేళ్లుగా ఆమె సంఘ్ తరఫున మాత్రం అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అయోధ్యలో రామమందిరం పునర్నిర్మాణానికి విరాళాలివ్వడంతోపాటు వసూలు చేశారు. మత్స్యకారుల్లో వాడబలిజ సామాజికవర్గానికి చెందిన ఆమె జాతీయ మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. బీజేపీకి చెందిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతితోనూ సత్సంబంధాలున్నాయి. ఈ బంధమే ఆమెకు పదవి రావడానికి దోహదపడినట్లు చెబుతున్నారు. మరోవైపు.. పద్మశ్రీకి ఎమ్మెల్సీ ఇవ్వడంపై కాకినాడ వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. పార్టీ కోసం ఏనాడూ పనిచేయని.. పార్టీలో ఎవరికీ పెద్దగా తెలియని ఆమెకు పదవి ఎలా ఇస్తారని పార్టీలోని వాడబలిజ సామాజికవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు.
Updated Date - 2023-02-21T03:13:42+05:30 IST