క్వారీలో డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి
ABN, First Publish Date - 2023-03-26T04:27:41+05:30
క్వారీలో ప్రమాదవశాత్తు డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి చెందగా మరో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి.
మరో ఇరువురికి గాయాలు
వినుకొండటౌన్, మార్చి 25 : క్వారీలో ప్రమాదవశాత్తు డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి చెందగా మరో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పల్నాడు జిల్లా వినుకొండ మండలం తిమ్మాయపాలెం పంచాయతీ పరిధిలోని ఉప్పరపాలెంకు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న వెంకటశివసాయి స్టోన్ క్రషర్ యజమానికి చెందిన క్వారీలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సర్వే నంబరు 29లో పంగలూరి వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా క్వారీతో పాటు స్టోన్ క్రషర్ నిర్వహిస్తున్నారు. క్రషర్, క్వారీల్లో కూలీలుగా ఛత్తీ్సగఢ్ రాష్ర్టానికి చెందిన సుమారు 25 మంది గత మూడు నెలలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం క్వారీలోని కొండరాళ్లను పగలగొట్టేందుకు వెళ్లిన బుద్దరం పడమి (31), రుఫదర్ (19)తో పాటు మండోలి శ్యామ్, మంగలో పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో కొండరాళ్లను పగలగొట్టేందుకు 110కి పైగా డిటోనేటర్లు అమర్చారు. గంటల వ్యవధిలో క్వారీ కోసం అమర్చిన 10 నుంచి 15 డిటోనేటర్లు పేలడంతో కొండరాళ్ల కిందపడి రుఫదర్ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన మిగిలిన ముగ్గురిని వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ పడమి మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2023-03-26T04:28:05+05:30 IST