యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ABN, First Publish Date - 2023-06-11T03:44:34+05:30
యువత ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎ్సటీ) కార్యదర్శి డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ పేర్కొన్నారు.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం కార్యదర్శి డాక్టర్ ఎస్.చంద్రశేఖర్
ఘనంగా గీతం డీమ్డ్ వర్సిటీ 14వ స్నాతకోత్సవం
‘తేజస్’ ఫైటర్ ఎయిర్ క్రాప్ట్స్ సృష్టికర్త
డాక్టర్ కోట హరినారాయణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
విశాఖపట్నం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): యువత ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎ్సటీ) కార్యదర్శి డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవం శనివారం వర్సిటీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్టార్టప్ కంపెనీలు పెట్టి బిలియన్ డాలర్లు ఆర్జించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
వాతావరణ మార్పులను ఆకలింపు చేసుకుని పర్యావరణ పరిరక్షణకు అనుగుణమైన పరిశోధనలు చేయాలని, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పెరుగుతోందని, ఆ దిశగా ఆలోచనలు ఉండాలని సూచించారు. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న పోటీలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరించి సరికొత్త ఆలోచనలతో ముందుకుసాగాలని ఆయన పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ, చాట్ జీపీటీ వంటివి మానవ మేధస్సును పక్కదారి పట్టించేవిగా ఉండకూడదని ఆయన స్పష్టంచేశారు. స్నాతకోత్సవంలో భాగంగా తేజస్ ఫైటర్ ఎయిర్క్రాప్ట్స్ సృష్టికర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కోట హరినారాయణకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ సైన్స్)ను, సినీ నటి వాణిశ్రీకి గౌరవ డాక్టరేట్ (డిలిట్...డాక్టర్ ఆఫ్ లిటరేచర్)ను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా హరినారాయణ మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలు నాశనం చేసిన వాతావరణాన్ని తిరిగి పునరుద్ధరించే బృహత్తరమైన కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గీతం విశ్వవిద్యాలయం చైర్మన్ ఎం.శ్రీభరత్, చాన్సలర్ డాక్టర్ వీరేంద్రసింగ్ చౌహాన్, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం, ఉపాధ్యక్షుడు ఎం.గంగాధరరావు, కార్యదర్శి ఎం.భరద్వాజ, రిజిస్ర్టార్ డాక్టర్ డి.గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ప్రాంగణం నుంచి 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంబీఏ, బీబీఎం, బీకాం వంటి కోర్సులు పూర్తిచేసిన 2,769 మంది పట్టభద్రులకు స్నాతకోత్తర డిగ్రీలను, 84 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్ (పీహెచ్డీ), అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 72 మందికి బంగారు పతకాలను అందజేశారు.
Updated Date - 2023-06-11T04:31:53+05:30 IST