ఆదివాసీల హక్కులను హరిస్తున్న బీజేపీ, వైసీపీ
ABN, First Publish Date - 2023-04-26T04:23:16+05:30
ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ హరిస్తున్నాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజం
అరకులోయ, ఏప్రిల్ 25: ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ హరిస్తున్నాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో బీజేపీ మత విధ్వంసాన్ని సృష్టించి జాతి ఐక్యతను దెబ్బతీస్తోందని ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని సూచించారు. బీజేపీ ప్రభుత్వం అటవీ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందని, గ్రామ సభల అనుమతి లేకుండానే దేశ సంపదను అదానికి అప్పగించడానికి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు మొగ్గుచూపుతోందని విమర్శించారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ వైసీపీ, టీడీపీలు బీజేపీ పల్లకీ మోయడం సరికాదన్నారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీ వైపు ఉంటారా?, ప్రజల వైపు ఉంటారా?...అంటూ జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఆయన ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బీజేపీ, వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని పేర్కొన్నారు. అంతకుముందు సీపీఎం, సీపీఐ శ్రేణులు భారీర్యాలీ నిర్వహించాయి.
Updated Date - 2023-04-26T04:23:16+05:30 IST