Collapsed Bridge : కుప్పకూలిన బహుదా నది వంతెన
ABN, First Publish Date - 2023-05-04T03:07:07+05:30
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద బహుదా నదిపై 1929లో నిర్మించిన బ్రిటిష్ కాలంనాటి వంతెన కుప్పకూలింది.
● 15 అడుగుల లోతులో పడిపోయిన గ్రానైట్లారీ
ఇచ్ఛాపురం, మే 3: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద బహుదా నదిపై 1929లో నిర్మించిన బ్రిటిష్ కాలంనాటి వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో వంతెన మీద 80 టన్నుల గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ నదిలో 15 అడుగుల లోతులో పడిపోయింది. అయితే నదిలో నీరు లేకపోవడంతో లారీ డ్రైవర్ రాఘవతో పాటు క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒడిసా రాష్ట్రంలోని అస్కా నుంచి ఒంగోలుకు గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ బుధవారం ఉదయం 6గంటల సమయంలో బహుదా నది వంతెన పైకి వచ్చింది. అంతే ఆ బరువుకు వంతెన కూలిపోవటంతో నదిలో లారీ ఒకవైపు, గ్రానైట్ రాయి మరోవైపు పడిపోయాయి. ఆ సమయంలో వంతెనపై ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ వంతెన నిర్మించి 94 ఏళ్లు దాటింది. వంతెన జీర్ణావస్థకు చేరుకుని ఏళ్లు గడుస్తున్నా.. దీన్ని తొలగించి కొత్తది నిర్మించలేదు. అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అన్నారు.
Updated Date - 2023-05-04T03:07:07+05:30 IST