CM Babai : సీఎం బాబాయ్ అంటే అంతే మరి!
ABN, First Publish Date - 2023-10-19T03:18:14+05:30
ఆర్టీసీ బస్సులో మనం ఒక ఊరి వరకూ టికెట్ తీసుకుని అంతకు దాటి ప్రయాణిస్తే కండక్టర్ దించేయకుండా ఉంటాడా? కానీ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డికి మాత్రం రూల్స్ వర్తించవు!
గడువు ముగిసినా కుర్చీ వదలరు
ఆర్టీసీ చైర్మన్, పాలకమండలి వింత వైఖరి
గత నెలలోనే ముగిసిన పదవీ కాలం
అయినా అధికారిక కార్యక్రమాలకు హాజరు!
చేసేది లేక భరిస్తున్న ఆర్టీసీ అధికారులు
‘జగనన్న పాలన’ కదా అంటూ వ్యంగ్యాస్ర్తాలు]
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆర్టీసీ బస్సులో మనం ఒక ఊరి వరకూ టికెట్ తీసుకుని అంతకు దాటి ప్రయాణిస్తే కండక్టర్ దించేయకుండా ఉంటాడా? కానీ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డికి మాత్రం రూల్స్ వర్తించవు! ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి జగన్కు స్వయానా చిన్నాన్న గనుక. పదవీ కాలం ముగిసిపోయినా చైర్మన్ పదవిలో కొనసాగిస్తూ ఆయనతో ఆర్టీసీ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. ప్రజా రవాణా సంస్థ అయిన ఏపీఎ్సఆర్టీసీ ప్రజలకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేలా చూడాలంటూ ప్రభుత్వాలు పాలక మండలిని నియమిస్తున్నాయి. చైర్మన్తోపాటు రీజినల్ చైర్మన్లను సైతం నియమించి ఆయా ప్రాంతాల్లో కార్పొరేషన్ సేవలు పెంచడం, ప్రయాణికుల ఆదరణ చూరగొనడం జోనల్ చైర్మన్లు చేయాలి. అయితే రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన ఆర్టీసీ బోర్డులో కడప జిల్లాకు చెందిన మల్లికార్జున రెడ్డిని చైర్మన్గా చిత్తూరు జిల్లాకు చెందిన మెట్టపల్లి విజయానంద రెడ్డి వైస్ చైర్మన్గా, రీజినల్ చైర్మన్లుగా జి.బంగారమ్మ, టి.పద్మావతి, బత్తుల సుప్రజ, మాల్యవంతం మంజులను వైసీపీ ప్రభుత్వం నియమించింది. వీరితోపాటు ఆర్టీసీ, రవాణా, కేంద్ర ప్రభుత్వ అధికారులకు సైతం బోర్డులో స్థానం కల్పించింది. ఏపీఎ్సఆర్టీసీ పాలకమండలిని 2021 సెప్టెంబరు 15న నియమించిన వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పదవీ కాలాన్ని కల్పించింది. చైర్మన్గా సీఎం జగన్ సొంత బాబాయ్ అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి(వైఎస్ విజయమ్మ సోదరి(చిన్నాన్న కూతురు) భర్త)ని నియమించారు.
రెండేళ్లలో ఈ పాలక మండలి ప్రయాణికుల కోసం ఏమి చేసిందని అడిగితే రెండు సార్లు చార్జీల బాదుడుతో నడ్డి విరిచిందనే మాట టక్కున వినిపిస్తుంది. ఒక్క కొత్త బస్సూ ఈ పాలకమండలి హయాంలో కొనలేదు. అయితే గత నెల 15తో చైర్మన్తోపాటు వైస్ చైర్మన్, రీజినల్ చైర్మన్ల పదవీ కాలం ముగిసిపోయింది. ప్రభుత్వం రెన్యువల్ చేస్తూ ఎలాంటి జీవో విడుదల చేయలేదు. కానీ ఎక్కడికక్కడ పదవుల్లో మాత్రం వైసీపీ నేతలు ఎంజాయ్ చేస్తున్నారు. అనంతపురంలో ఆర్టీసీ డిస్సెన్సరీ గురువారం నాడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎండీ తిరుమలరావును ఆహ్వానించిన అధికారులకు చైర్మన్, రీజినల్ చైర్మన్ను ఎందుకు పిలవలేదంటూ ఫోన్లు వచ్చాయి. పదవీ కాలం ముగిసి పోయింది కదా? అంటే ముఖ్యమంత్రి చిన్నాన్నకు అలాంటివేవీ వర్తించబోవని చెప్పడంతో చేసేది లేక ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
Updated Date - 2023-10-19T03:18:14+05:30 IST