పుస్తకాలు ఇచ్చేదెప్పుడో?
ABN, First Publish Date - 2023-06-03T01:31:02+05:30
వేసవి సెలవుల అనంతరం ఇంటర్ కళాశాలలు గురువారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కళాశాలలో అడుగుపెట్టే రోజుకు పాఠ్యపుస్తకాలందించేలా చర్యలు చేపడతామన్న పాలకుల మాటలు ఆచరణకు రాలేదు.
తిరుపతి(విద్య), జూన్ 2: వేసవి సెలవుల అనంతరం ఇంటర్ కళాశాలలు గురువారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కళాశాలలో అడుగుపెట్టే రోజుకు పాఠ్యపుస్తకాలందించేలా చర్యలు చేపడతామన్న పాలకుల మాటలు ఆచరణకు రాలేదు. గతేడాది ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పూర్తిగా అందించకుండానే పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓల్ట్స్టాక్ (గ్రౌండ్ బ్యాలెన్స్) కింద ఉన్న 10 శాతం టైటిల్స్ పుస్తకాలను మాత్రమే విద్యార్థులకు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఏడాదంతా పాఠ్యపుస్తకాలు లేకుండానే చదువులు సాగించిన పరిస్థితి తెలిసిందే. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి నెలకు ముందుగా అధికారుల నుంచి బోర్డు ఉన్నతాధికారులు ఇండెంట్ అడిగినా ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు జిల్లాస్టాక్ పాయింట్లకు చేరని పరిస్థితి. పదో తరగతి పాసైన విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండంటూ అధ్యాపకులు ఇంటింటికీ తిరిగి ప్రవేశ దరఖాస్తులను అందిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా తమ పిల్లలను కళాశాలల్లో ఎలా చేర్పించమంటారని తల్లిదండ్రుల నుంచి వస్తున్న ప్రశ్నలకు అధ్యాపకులు సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ కళాశాలల్లో 9నెలల కిందట ప్రారంభించిన మేజర్, మైనర్ మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. పబ్లిక్ పరీక్షల కారణంగా రెండు నెలలుగా పనులను తాత్కాలికంగా ఆపివేశారు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్స్(ఆర్వో ప్లాంట్, జీసీబీ, పెయింట్స్)ని ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఇందుకు అవసరమైన ఇండెంట్ను జిల్లాస్థాయి అధికారులు ఇంటర్ బోర్డుకు అందించినట్లు తెలిసింది. దాంతో ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు గ్రీన్చాక్బోర్డుల(జీసీబీ) ద్వారా విద్యాబోధన జరగనుందని అధికారులు అంటున్నారు.
ఇంటర్ బోర్డుకు ఇండెంట్ పంపాం
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అవసరమైన పాఠ్య పుస్త్తకాల కోసం ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇండెంట్ అడిగారు. గతేడాదిలో ఎన్రోల్మెంట్ ఉన్న విద్యార్థులకన్నా 10శాతం ఎక్కువగా పంపమన్నారు. పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరిన వెంటనే విద్యార్థులకు అందిస్తాం. ఈలోపు సీనియర్ విద్యార్థుల వద్ద ఉన్న పుస్తకాలను జూనియర్లకు అందించేలా చర్యలు చేపడతాం.
- విశ్వనాథనాయక్, డీవీఈవో
Updated Date - 2023-06-03T01:31:02+05:30 IST