వి.కోట టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట
ABN, First Publish Date - 2023-09-22T01:05:23+05:30
పుంగనూరు ఘటనలో వి.కోట టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. రెండున్నర నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వీరికి గురువారం న్యాయమూర్తి సురే్షరెడ్డి బెయిల్ మంజూరు చేశారు.
వి.కోట, సెప్టెంబరు 21: పుంగనూరు ఘటనలో వి.కోట టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. రెండున్నర నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వీరికి గురువారం న్యాయమూర్తి సురే్షరెడ్డి బెయిల్ మంజూరు చేశారు. ఆగస్టు 4న వి.కోట మండలం అనంతపురంలో అధికార వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య గొడవలు జరిగి పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. అదే సమయానికి పుంగనూరులో జరిగిన గొడవలకు సంబంధించి వి.కోటకు చెందిన ఎనిమిది మంది ముఖ్యనేతలపై కేసు నమోదైంది. వీరంతా వి.కోట మండలంలో జరిగిన వివాదంలో ఉన్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ఒకే సమయంలో.. రెండు చోట్ల ఎలా?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఫిర్యాదుదారు అయిన పాలసముద్రం ఎస్ఐ ప్రసాద్బాబు ఆ రోజున పుంగనూరు ఘటనలో తమపై దాడికి పాల్పడిన వారిలో వి.కోటకు చెందిన టీడీపీ నేతలు లేరని, పొరపాటున వారి పేర్లు కేసులో నమోదు చేసినట్లు కోర్టుకు వివేదిక సమర్పించారు. ఇదే అంశాన్ని బాధితుల తరపున న్యాయవాది శరత్చంద్ర హైకోర్టు న్యాయమూర్తి సురే్షరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వి.కోట మండల టీడీపీ అధ్యక్షుడురంగనాథ్, జిల్లా అధికార ప్రతినిధి రాంబాబు, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్, మండల ఐటీడీపీ అధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఎంపీటీసీ భక్తా, విశ్వనాథ్, మండల ఎస్సీ సెల్ కార్యదర్శి రాంబాబుకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. దీంతో మండల టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకొన్నారు. తప్పుడు కేసులు ఎన్నటికీ నిలబడవని, అందుకు పుంగనూరు కేసు నిదర్శనమన్నారు.
‘పుంగనూరు’ కేసుల్లో 74 మందికి బెయిల్ మంజూరు
పుంగనూరు, సెప్టెంబరు 21: ‘పుంగనూరు’ కేసులకు సంబంధించి 74 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు గురువారం హైకోర్టు జడ్జి కె.సురేశ్రెడ్డి బెయిల్ మంజూరు చేశారు. పుంగనూరు పోలీసులు నమోదు చేసిన ఏడు కేసుల్లోని వీరికి బెయిల్ మంజూరు చేయాలని పలువురు న్యాయవాదులు హైకోర్టులో పటిషన్లు దాఖలు చేశారు. కేసుల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేయగా, అధిక సంఖ్యలో పుంగనూరు టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డితో బాటు నాయకులు, కార్యకర్తలు ఈనెల నాలుగోతేది పుంగనూరు పోలీసుస్టేషన్లో డీఎస్పీ సుఽధాకర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఏడు కేసుల్లోని వారిని న్యాయస్థానంలో హాజరుపరిచి పోలీసులు చిత్తూరు, మదనపల్లె, కడప సెంట్రల్ జైళ్లకు రిమాండుకు తరలించారు. కాగా, హైకోర్టులో న్యాయవాదులు వై.కోటేశ్వరరావు, జి.ధనంజయ, డి.కోటేశ్వరరావు, జె.శరత్చంద్ర, ఎస్.శ్రీనివాసరావు, జి.బసవేశ్వరరావు, వై.దుర్గారావు, లక్ష్మినారాయణ బెయిల్ పిటీషన్లు దాఖలు చేయగా వాటిని పరీశీలించి 74 మందికి కండీషన్ బెయిళ్లు మంజూరు చేశారు. కాగా 7 కేసుల్లో ఏ1గా ఉన్న టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డికి మాత్రం అన్ని కేసుల్లో బెయిళ్లు మంజూరుకాకపోవడంతో కడపజైలులో రిమాండ్లో ఉన్నారు.
Updated Date - 2023-09-22T01:05:23+05:30 IST