తిరుమల ఘాట్లో ప్రమాదాలు నివారిద్దాం
ABN, First Publish Date - 2023-06-03T01:50:45+05:30
తిరుమల ఘాట్లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుమల, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): తిరుమల ఘాట్లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం టీటీడీ పరిపాలన భవనంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు, టీటీడీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిషోర్, ఎఫ్ఏసీఏవో బాలాజి, ఇంజనీరింగ్ సలహాదారుడు రామచంద్రారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, బర్డ్ ఆస్పత్రి ప్రత్యేకాధికారి రెడ్డెప్పరెడ్డి, రుయా సూపరింటెండెంట్ రవిప్రభు, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆర్టీసీ ఆర్ఎం చెంగల్రెడ్డి, ఇన్చార్జి ఆర్టీవో రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలిలా..
ఫ మొదటి ఘాట్(డౌన్)లో ఒకటో మలుపు, ఏడో మైలు, అలిపిరి డౌన్ గేట్, లింక్రోడ్డు, సహజసిద్ధంగా ఏర్పడిన ఆర్చి (గరుడాకారం)ని చూసే ప్రదేశం, దివ్యారామం ప్రాంతాల్లో చెక్ పాయింట్స్ ఏర్పాటు.
- అప్ఘాట్ తరహాలో డౌన్ ఘాట్లోనూ కాంక్రీట్ రీటైనింగ్ వాల్స్ నిర్మాణం.
- ఏ రకమైన వాహనాలను ఘాట్లో నిషేధించవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలి.
- ప్రమాదాల నివారణకు విరివిగా సూచిక బోర్డులు.
- ఘాట్లో స్పీడ్ లిమిట్ ఎంత, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వినియోగం నిషేధం, తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను తెలిపేలా నిరంతరం కరపత్రాలు పంపిణీ.
- ఘాట్లో వాహనాల వేగాన్ని గుర్తించి.. తగిన చర్యలు తీసుకోవడానికి స్పీడ్ గన్స్ ఏర్పాటు.
- ఘాట్లో ప్రమాదాలు జరిగిన తక్షణమే రుయాతో పాటు స్విమ్స్, బర్డ్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలందించేలా చూడాలి.
Updated Date - 2023-06-03T01:50:45+05:30 IST