శ్రీకాళహస్తీశ్వరాలయంలో నకిలీ రాహుకేతు పూజలు
ABN, First Publish Date - 2023-07-06T01:09:20+05:30
శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రతిష్టను గుడిలో పనిచేసే కొందరు ఉద్యోగులే సొంత ఆదాయం కోసం అభాసుపాల్జేస్తున్నారు. ఇంటిదొంగల సహకారంతో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి బహిరంగ దందాకు తెరతీశాడు. ఏకంగా అనుబంధ ఆలయ ప్రాంగణంలో బహిరంగంగా నకిలీ రాహుకేతు పూజలు చేస్తూ రెండేళ్లుగా భక్తులను బురిడీ కొట్టిస్తున్నాడు.
శ్రీకాళహస్తి, జూలై 5: శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రతిష్టను గుడిలో పనిచేసే కొందరు ఉద్యోగులే సొంత ఆదాయం కోసం అభాసుపాల్జేస్తున్నారు. ఇంటిదొంగల సహకారంతో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి బహిరంగ దందాకు తెరతీశాడు. ఏకంగా అనుబంధ ఆలయ ప్రాంగణంలో బహిరంగంగా నకిలీ రాహుకేతు పూజలు చేస్తూ రెండేళ్లుగా భక్తులను బురిడీ కొట్టిస్తున్నాడు.శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు జరిపించుకోవడానికి దేశ నలుమూలల నుంచీ భక్తులు విచ్చేస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులకు అవగాహన లేకపోవడంతో కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారు.ఆలయంలో రూ.500, రూ.750, రూ.1,500, రూ.2,500, రూ.5వేల విభాగాల్లో పూజలు నిర్వహిస్తుంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి రాహుకేతు పూజలు నిర్వహిస్తానంటూ రూ.10వేల నుంచి రూ.20వేల వరకు బేరం కుదుర్చుకుని ముక్కంటి ఆలయానికి చెందిన భరద్వాజతీర్థంలో బహిరంగంగా పూజలు చేయిస్తున్నాడు.ఇతడికి ముక్కంటి ఆలయ ఉద్యోగులు కొందరు సహకరిస్తున్నట్లు తెలిసింది. పారాయణం చేసే ఓ ఉద్యోగికి సొంత వసతిగృహం ఉంది.తమిళనాడు వ్యక్తి బేరం కుదుర్చుకున్న భక్తులను మొదట ఆ వసతిగృహంలోనే దించుతారు. మరుసటి రోజు భరద్వాజతీర్థంలో నాగశిలల వద్ద పూజల ప్రక్రియను పూర్తి చేస్తారు. అనంతరం ముక్కంటి ఆలయ పాలకమండలి అటెండర్గా ఉన్న ఒక వ్యక్తి, అమ్మవారి ఆలయంలో అటెండర్గా ఉన్న మరో వ్యక్తి, పబ్లికేషన్ స్టాల్లో పనిచేసే ఇంకో వ్యక్తి, అర్చక విభాగంలో పనిచేసే ఒకరు దర్శనాలు వారికి ప్రత్యేక అంతరాలయ దర్శనాలను కల్పిస్తారు.నకిలీ పూజలతో వచ్చిన సొమ్మును అందరూ పంచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
భరద్వాజ తీర్థంలో ఆగని వివాదాలు
భరద్వాజ తీర్థంలో తరచూ వివాదాలు కలకలం రేపుతూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఓ యువకుని ఏకం ఆలయం పక్కనే కొందరు ఖననం చేశారు. దీనిపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. పూడ్చిన దేహం అవధూతదని.. అయినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. అపుడు నమోదైన కేసు ఇప్పటికి విచారణలోనే ఉంది. ఆ తరువాత కొద్ది నెలలకు భరద్వాజ తీర్థంలోనే ఇష్టారాజ్యంగా నాగశిలలను బయటి వ్యక్తులు ప్రతిష్టించారంటూ దుమారం రేగింది. మళ్లీ ఇన్నాళ్లకు తమిళనాడుకు చెందిన వ్యక్తి నకిలీ రాహుకేతు పూజలు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అసలు భరద్వాజ తీర్థంపై అధికారులు నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
Updated Date - 2023-07-06T01:09:20+05:30 IST