పంచాయతీల్లో నగదురహిత సేవలు
ABN, First Publish Date - 2023-09-22T00:53:28+05:30
గ్రామ స్వరాజ్ యాప్ ద్వారా పంచాయతీల్లో నగదురహిత పద్ధతిలో సేవారుసుముల వసూళ్లు ప్రారంభించినట్లు జడ్పీ సీఈవో ప్రభాకర్రెడ్డి తెలిపారు.
శిక్షణ తరగతులను ప్రారంభించిన జడ్పీ సీఈవో
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 21: గ్రామ స్వరాజ్ యాప్ ద్వారా పంచాయతీల్లో నగదురహిత పద్ధతిలో సేవారుసుముల వసూళ్లు ప్రారంభించినట్లు జడ్పీ సీఈవో ప్రభాకర్రెడ్డి తెలిపారు. గురువారం జిల్లాపరిషత్ మీటింగ్ హాలులో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లతో యాప్ నిర్వహణపై ఒక రోజు శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మూడు వేలమందికి తక్కువగా వున్న జనాభాకు క్యూఆర్ కోడ్లు ఇచ్చామని, అంతకు మించి జనాభా ఉన్న పంచాయతీలకు ఈ-పోస్ మిషన్లు అందించామని వివరించారు. వీటి ద్వారా నగదురహిత లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. స్వమిత్ర సర్వే జరిగిన గ్రామాల్లో ఆస్తిపత్రాలను త్వరలో అందజేయాలని డీపీవో లక్ష్మి చెప్పారు. అన్యాక్రాంతమైన భూముల విషయంలో ఆక్రమణదారులకు వరుసగా మూడు నోటీసులు జారీచేసి, నిబంధనల మేర వాటిని తొలగించాలన్నారు. డీపీఆర్సీ ఐ.ఆర్.షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T00:53:28+05:30 IST