తిరుమల కళకళ
ABN, First Publish Date - 2023-01-02T01:03:36+05:30
వైకుంఠ ఏకాదశికి తిరుమల పుణ్యక్షేత్రం ముస్తాబైంది. శ్రీవారి ఆలయ మహద్వార గోపురంతోపాటు ప్రాకారం, ధ్వజస్తంభం, ఉత్తర ద్వారంలో ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేశారు. ఆలయంలో ఐదు టన్నులు, వెలుపల ఐదు టన్నుల సంప్రదాయ పుష్పాలతో అలంకరణలు చేశారు. మరో లక్ష కట్ ఫ్లవర్స్తో ఆలయంలోని ధ్వజస్తంభాన్ని, బలిపీఠం, ఉత్తరద్వారాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దారు.
ఆకట్టుకుంటోన్న విద్యుత్, పుష్పాలంకరణలు
తిరుమల, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశికి తిరుమల పుణ్యక్షేత్రం ముస్తాబైంది. శ్రీవారి ఆలయ మహద్వార గోపురంతోపాటు ప్రాకారం, ధ్వజస్తంభం, ఉత్తర ద్వారంలో ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేశారు. ఆలయంలో ఐదు టన్నులు, వెలుపల ఐదు టన్నుల సంప్రదాయ పుష్పాలతో అలంకరణలు చేశారు. మరో లక్ష కట్ ఫ్లవర్స్తో ఆలయంలోని ధ్వజస్తంభాన్ని, బలిపీఠం, ఉత్తరద్వారాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దారు. మహద్వారం గోపురానికి శంఖు, చక్ర, నామాల నడుమ పుష్పాలతో తయారుచేసిన మహావిష్ణువు, లక్ష్మీదేవి దేవతామూర్తుల కటౌట్ ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లోని పుష్పాలంకరణలు కనువిందు చేస్తున్నాయి. ఆలయం ముందు ఏర్పాటు చేసిన ‘వైకుంఠ మండపం’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీమహావిష్ణువుతోపాటు అష్టలక్ష్మీ, దశావతారాల ప్రతిమలను మండపంలో ఏర్పాటు చేశారు. 30 వేల కట్ఫ్లవర్స్తోపాటు టన్ను సంప్రదాయ పుష్పాలతో మండపాన్ని అలంకరించారు. ఆలయం ముందు గొల్లమండపం వద్ద ఏర్పాటు చేసిన శ్రీవారు, గ్లోబు విద్యుత్ ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.
వీఐపీలకు పక్కా ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన వీఐపీలు భక్తులకు టీటీడీ పక్కా ఏర్పాట్లు చేసింది.సుప్రీం, హై కోర్టు న్యాయమూర్తులు, మంత్రులకు వెంకటకళ అతిథి గృహంలోని కౌంటర్ ద్వారా, టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులకు సన్నిధానంలోని కౌంటర్ ద్వారా దర్శన టికెట్లు కేటాయించారు. వీరు రాంభగీచా కాటేజీ మీదుగా సుపథం ద్వారా ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు కలిగిన వారికి సన్నిధానం కౌంటర్ ద్వారా టికెట్లు కేటాయించారు. ఎంపీలు, ఎమ్మెల్యే, ఎంఎల్సీలకు సారంగి రెస్టారెంట్లోని కౌంటర్ల ద్వారా టికెట్లు కేటాయించారు. వీరందరూ వైకుంఠం క్యూకాంప్లెక్స్1 నుంచి ఆలయంలోకి వెళ్లనున్నారు.
భక్తులకు వసతి కష్టాలు
తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగిన నేపథ్యంలో వసతికి భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ను రద్దు చేసిన టీటీడీ.. ముందు వచ్చిన వారికి ముందు ప్రాదిపదికన సీఆర్వో కౌంటర్లో గదులు కేటాయించారు. ఆదివారం ఉదయానికే గదులన్నీ పూర్తికావడంతో ఆతర్వాత వచ్చిన భక్తులు గదుల లభించక ఇబ్బంది పడ్డారు. పైగా వీఐపీల తాకిడి కూడా అధికంగా ఉండటంతో సామాన్య భక్తులకు వసతి కష్టాలు అధికమయ్యాయి. దీంతో కార్యాలయాల ముందు, పీఏసీల్లో, ఫుట్పాత్లపైనే సేదతీరాల్సి వచ్చింది. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన భక్తులు తీవ్రమైన చలిలో ఇబ్బంది పడ్డారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తిరుగు ప్రయాణంలోనూ ఇక్కట్లు తప్పలేదు. బస్సులు ఎక్కేందుకు స్వల్ప తోపులాటలు చోటుచేసుకున్నాయి.
Updated Date - 2023-01-02T01:03:38+05:30 IST