Chandrababu : ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు!
ABN, First Publish Date - 2023-06-02T04:18:02+05:30
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అప్రమత్తంగా ఉండి వాటికి సన్నద్ధం కావాలని తమ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులను టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. గురువారమిక్కడ తన నివాసంలో ఐదు నియోజకవర్గ
ఇప్పటి నుంచే సన్నద్ధంగా ఉండాలి
టీడీపీ ఇన్చార్జులకు చంద్రబాబు ఆదేశం
10 నుంచి ‘భవిష్యత్కు గ్యారెంటీ’ ప్రచారం
● 150 రోజుల పాటు నిర్వహణ
అమరావతి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అప్రమత్తంగా ఉండి వాటికి సన్నద్ధం కావాలని తమ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులను టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. గురువారమిక్కడ తన నివాసంలో ఐదు నియోజకవర్గ ఇన్చార్జులు.. నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), మండలి బుద్ధ ప్రసాద్ (అవనిగడ్డ), బొండా ఉమామహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య (నందిగామ), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట)లతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. వారి నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రస్తావన వచ్చింది. ‘షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు వస్తాయని తాపీగా కూర్చోవద్దు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. వాటికి సంబంధించి కదలికలు కనిపిస్తున్నాయి. మీరు వేగం పెంచండి. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లండి. కార్యకర్తలను కదిలించండి. ఎక్కడైనా ఎవరితోనైనా సమస్యలున్నా.. విభేదాలున్నా వాటిని పరిష్కరించుకోండి. మీరే ఒక అడుగు తగ్గి కలుపుకోండి. మనం ప్రకటించిన మేనిఫెస్టోలోని వాగ్దానాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లండి. ప్రత్యేకించి మహిళల్లోకి బాగా వెళ్లాలి. నేను ఆశించిన స్థాయిలో మీ పనితీరు ఉండాలి’ అని ఆయన వారికి చెప్పినట్లు తెలిసింది.
ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిపై తనకు అందిన సమాచారం, వివిధ సర్వేల్లో వచ్చిన ఫలితాలను ఆయన వివరించి.. ఇంకా ఎక్కడెక్కడ సరిచేసుకోవాలో వారితో చర్చించారు. ‘నేను ఎవరినీ వదులుకోను. మీకు తెలుసు. బాగా పనిచేస్తే నా ప్రోత్సాహం బాగా ఉంటుంది. మీరు పనిచేయకుండా వెనుకబడిపోతే నేను మరొకరిని వెతుక్కోవాల్సి ఉంటుంది. మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను. అదే సమయంలో పనిచేయకపోతే కూడా ఊరుకోను’ అని తేల్చిచెప్పారు. ఇంకోవైపు.. ‘భవిష్యత్కు గ్యారెంటీ’ పేరిట టీడీపీ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతోంది. ఈ నెల పదో తేదీన చంద్రబాబు దీనిని ప్రారంభిస్తారు. 150 రోజులు అంటే ఐదు నెలల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మహానాడులో ‘భవిష్యత్కు గ్యారెంటీ’ పేరిట టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో జనంలోకి వెళ్తున్నారు. దీని నిర్వహణపై చంద్రబాబు శుక్రవారం నియోజకవర్గ పరిశీలకులతో చర్చించనున్నారు. గురువారం ఇన్చార్జులతో సమావేశమైనప్పుడు.. ఈ మేనిఫెస్టోపై ప్రజల స్పందనేంటో ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. జనంలోకి బాగానే వెళ్లిందని, టీడీపీ శ్రేణులు ఎవరికి వీలైన పద్ధతిలో వారు వాటిని ప్రచారం చేస్తున్నారని వారు చెప్పారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బాగా ప్రయత్నం చేయాలని, ఫీడ్ బ్యాక్ ఏమిటో కూడా తనకు చెప్పాలని ఆయన సూచించారు.
గంగాధర నెల్లూరు టీడీపీ ఇన్చార్జిగా డాక్టర్ థామస్
ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా డాక్టర్ వీఎం థామస్ నియమితులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశం ప్రకారం ఆయన్ను నియమించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియోజకవర్గం పరిధిలోని కార్వేటి నగరం మండలానికి చెందిన థామస్ ప్రస్తుతం చెన్నైలో ఛాతీవ్యాధి నిపుణుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు ఎలాంటి రాజకీయ నేపఽథ్యం లేదు. యువతకు అవకాశం ఇవ్వాలన్న కోణంలో ఆయన ఎంపిక జరిగినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. దళిత వర్గానికి చెందిన థామస్ ఏడాదికాలంగా టీడీపీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. మొదట ఆయన్ను చిత్తూరు లోక్సభ స్థానంలో పోటీ చేయించాలనుకున్నారు. తర్వాత చంద్రబాబు కొన్ని సమీకరణలను పరిగణనలోకి తీసుకుని ఆయన్ను గంగాధర నెల్లూరుకు ఎంపిక చేశారు.
Updated Date - 2023-06-02T04:18:02+05:30 IST