‘సహకారం’లో అవినీతి చెదలు
ABN, First Publish Date - 2023-06-19T03:02:08+05:30
రాష్ట్రంలో సహకార వ్యవస్థ నిర్వీర్యమౌతోంది. రైతులకు పరపతి కల్పించాల్సిన సహకార సంఘాలు అధికార పార్టీ నేతల అక్రమాలకు ఆలవాలమయ్యాయి.
కార్పొరేట్లకే కోఆపరేషన.. పీఏసీఎ్సల్లో 50ు ప్రైవేట్ పెట్టుబడులు.. భాగస్వాములకు ఓటింగ్ హక్కులు
ప్రైవేట్ వ్యక్తులకు సొసైటీల పగ్గాలు
కేంద్రం సూచనకు తలూపిన జగన సర్కార్
నిపుణులతో చర్చించకుండానే చట్ట సవరణలు
ఐదున్నరేళ్లుగా ఎన్నికలు లేకుండా ఇష్టారాజ్యం
త్రిసభ్య కమిటీలతో పాలన అస్తవ్యస్తం
బోగస్ పత్రాలతో రూ.కోట్ల రుణాలు స్వాహా
ఎంక్వైరీలు కాగితాలకే పరిమితం
రికవరీలపై దృష్టి పెట్టని అధికారులు
కంప్యూటీకరణ అదిగోఇదిగో పట్టాలెక్కని హెచఆర్ పాలసీ
ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆందోళనబాట
నేడు డీసీసీబీల ఎదుట ధర్నాలు
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో సహకార వ్యవస్థ నిర్వీర్యమౌతోంది. రైతులకు పరపతి కల్పించాల్సిన సహకార సంఘాలు అధికార పార్టీ నేతల అక్రమాలకు ఆలవాలమయ్యాయి. ఎన్నికలు లేకుండా ఐదున్నరేళ్లుగా అధికారేతర వ్యక్తుల ఏలుబడిలో ఇష్టారాజ్యమైంది. వైసీపీ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీలకు పీఏసీఎ్సలు ఏటీఎంలుగా మారాయి. ప్రభుత్వ పెద్దలు, నాబార్డు, సహకారశాఖ ఉన్నధికారులు పట్టించుకోకపోతుండటంతో కోట్లాది రూపాయలు స్వాహా అవుతున్నాయి. సెక్షన 51 ఎంక్వైరీలు కాగితాలకే పరిమితమయ్యాయి. దొంగ పత్రాలతో తీసుకున్న రుణాల రికవరీపై అధికారులకు శ్రద్ధ కొరవడింది. ఫలితంగా వందలాది సంఘాలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. సంఘాలు సజావుగా సాగేందుకు దోహదపడే ఉద్యోగుల హెచఆర్ పాలసీ పట్టాలెక్కడం లేదు. పీఏసీఎ్సల కంప్యూటరీకరణ కార్యరూపం దాల్చలేదు. ఇదే క్రమంలో పీఏసీఎ్సల్లో 50ు వాటాలను కార్పొరేట్ సంస్థలు, బడా వ్యాపారులకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రాథమిక సహకార సంఘాలు పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని సహకార రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేట్ పాలసీతో రైతుకు నష్టం
సహకార పరపతి సంఘాల్లో ఇప్పటి వరకు రైతులే వాటాదారులు. పీఏసీఎస్, డీసీసీబీ, ఆప్కాబ్ మేనేజ్మెంట్ కమిటీలలో రైతు ప్రతినిధులదేకీలకపాత్ర. చట్ట సవరణ వల్ల మూడంచెల సహకార వ్యవస్థలో క్షేత్రస్థాయిలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం పెరగనుంది. సహకార వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులపై నిఫుణులతో చర్చించకుండా ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తూ గతేడాది సెప్టెంబరులో చట్ట సవరణకు వైసీపీ సర్కార్ అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దీనివల్ల పీఏసీఎ్సల్లో 50ు వాటాలు ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీలు, చిట్ ఫండ్స్ కంపెనీల చేతుల్లోకి వెళ్లనున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో ఇలాంటి సవరణలకు ఆస్కారం ఇవ్వకపోవడం గమనార్హం. వైద్యనాథన సిఫార్సు మేరకు గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం చట్ట సవరణలతో సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. దీనికి భిన్నంగా వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా జగన సర్కార్ ప్రైవేట్ వాటాలకు తలుపులు బార్లా తెరిచింది. మరో వైపు రాష్ట్రాల జాబితాలో ఉన్న సహకార రంగాన్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకునేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. చట్ట సవరణల ప్రకారం ప్రతి సంఘంలో రూ.50లక్షలపైన 50ు వరకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు పెట్టుబడులు పెడతాయి. అంతకు మించి పెట్టుబడులు పెట్టదలచుకుంటే గ్రాంట్ల రూపంలో ఇవ్వొచ్చు. దీనివల్ల్ల ప్రైవేట్ వ్యక్తులకు ఆ సంఘంలో ఓటింగ్ హక్కులు కూడా లభిస్తాయి. ఓటింగ్ హక్కులతో సంఘాలు ప్రైవేట్పరం కానున్నాయి. మేనేజింగ్ కమిటీల్లోనూ ప్రైవేట్ వ్యక్తుల ఆధిపత్యం పెరగనున్నది. కార్పొరేట్ పాలసీ విధానాలతో రైతులకు సహకార రుణాలు అందని ద్రాక్షగా మారే ముప్పు ఉంది. వడ్డీలు కూడా ప్రైవేట్ వ్యక్తుల నిర్ణయాల మేరకు పెరిగి, రైతులకు రుణాలు భారమయ్యే పరిస్థితి ఉత్పన్నమౌతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలూ ఇష్టారీతిన పెంచే ప్రమాదం కూడా ఉందని రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రెండంచెల వ్యవస్థ అమలులో ఉంది. ఏపీలోనూ డీసీసీబీలను ఆప్కాబ్లో విలీనం చేస్తే, రైతులకు వడ్డీ భారం తగ్గుతుందని రైతు సంఘాలు సూచిస్తున్నాయి. డీసీసీబీలు ఆప్కాబ్ బ్రాంచలుగా మార్చాలని ఉద్యోగులూ కోరుతున్నా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. రైతుభరోసా కేంద్రాలను పీఏసీఎ్సలకు అనుసంధానం చేయడానికి సహకార చట్టంలో 115ఇ అధ్యాయాన్ని కూడా చేర్చారు. ఫలితంగా సంఘాల్లో జరిగే పరపతి, పరపతేతర లావాదేవీలతో పాటు ఆర్బీకేల్లో చేసే వ్యాపారం కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా జరిగే ధాన్యసేకరణ కూడా ప్రైవేట్ వ్యక్తుల హస్తగతం అవుతుందన్న మాట వినిపిస్తోంది.
ఎన్నికలు జరపకుండా కాలయాపన..
రాష్ట్రంలోని సహకార సంఘాలకు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగి పదేళ్లైంది. 2013 జనవరిలో ఎన్నికలు జరగ్గా, 2018 జనవరితో ముగిసిన ఆ పాలక వర్గాలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలల చొప్పున మూడు దఫాలు కొనసాగించింది. 2019 జులైలో జగన సర్కార్.. పాత పాలకవర్గాలను రద్దు చేసి, త్రిసభ్య కమిటీల పేరుతో అధికార పార్టీ వ్యక్తులను నియమించింది. కొందరు హైకోర్టును ఆశ్రయించగా, కొవిడ్ కారణంగా ఎన్నికలు జరపలేమని 2020లో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 2021లో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులను పర్సనఇనచార్జిలుగా నియమించింది. ఎన్నికల కోడ్ ముగియగానే తిరిగి త్రిసభ్య కమిటీలను కొనసాగించింది. కొవిడ్ అంతమైనా ఇప్పటికీ ఎన్నికలు జరపలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసుల మేరకు త్రిసభ్య కమిటీలకు ప్రతి ఆరు నెలలకు గడువు పెంచుతూ వస్తోంది. తాజాగా జూలై వరకు త్రిసభ్య కమిటీలకు గడువు ఉండగా, ఆ తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికలు జరపకుండా రాజకీయ నిరుద్యోగులకు పగ్గాలు అప్పగించడం వల్ల తిన్నోడికి తిన్నంత అన్నట్టు మారింది. త్రిసభ్య కమిటీలు అనేక సంఘాల్లో నిధుల కుంభకోణాలకు తెరదీశాయి. ప్రజాప్రతినిధుల అండదండలు, రెవెన్యూ అధికారుల సహకారంతో బోగస్ పత్రాలను సృష్టించి, పెద్ద మొత్తాల్లో రుణాలను స్వాహా చేశారు. గుంటూరు, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అనేక సహకార సంఘాల్లో రూ.వందల కోట్ల అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలోని సహకార సంఘాల్లో రూ.5వేల కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర సహకారశాఖ మంత్రి అమితషా దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐతో విచారణ జరపాలని నాబార్డు చైర్మనకూ లేఖ రాశారు. ఈ అవకతవకలపై సహకార శాఖ ఉన్నతాధికారులు సెక్షన 51 ప్రకారం ఎంక్వైరీలకు ఆదేశించి ఏళ్లు గడుస్తున్నా.. భోక్తల ఆస్తులను జప్తు చేయడం కానీ, కాజేసిన రుణాలను రికవరీ చేసిన దాఖలాలు కానీ లేవు. పీఏసీఎ్సల కంప్యూటరీకరణకు కేంద్రం నిధులు కేటాయించినా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చక అవినీతి జాడ్యం రాజ్యమేలుతోంది.
ఉద్యోగుల ఆందోళన బాట
సహకార సంఘాల ఉద్యోగులకు గత ప్రభుత్వం వేతన సవరణలతో కూడిన హెచఆర్ పాలసీ జీవో 36ను జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగులకు వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించారు. అయితే, ఆ జీవో ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీనికి అనుబంధంగా జగన్ ప్రభుత్వం జీవో 90ని జారీ చేసింది. జీవో 36లో ఉద్యోగుల ఎరియర్స్ను 2016నుంచి ఇవ్వాలని సూచించగా, 90 జీవోలో 2020 నుంచి ఇస్తామని పేర్కొనడంతో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది. 36 జీవోలో డివిజన స్థాయిలో బదిలీలు చేయాలని పేర్కొనగా, కొత్త జిల్లాలు ఏర్పడినందున జిల్లా ప్రాతిపదికన బదిలీలు ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగుల వయో పరిమితి పెంపు కోసం గత ప్రభుత్వం రూల్ 28కు సవరణలు చేయగా, ఈ ప్రభుత్వం 62 ఏళ్ల పెంపుదల జీవోను వర్తింపచేయడం లేదు. ఉద్యోగుల బదిలీల విషయంలో జీతభత్యాలకు గ్యారెంటీ కోసం జిల్లా స్థాయి మద్దతు నిధి ఏర్పాటు చేయాలని, 2019 పే రివిజన ప్రకారం జీతాభత్యాలు చెల్లించాలని కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. రెగ్యులర్ ఉద్యోగుల జీతాలను ఆడిట్ అధికారులు డ్యూ టూ పద్దులో చూపుతున్నారని, అయితే, డీసీసీబీ ఉద్యోగుల మాదిరిగా వర్కింగ్ క్యాపిటల్పై 2ు జీతభత్యాలకు ప్రామాణికంగా తీసుకోవాలని అడుగుతున్నారు. చట్ట ప్రకారం గ్రాట్యూటీని వర్తింపజేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లపై ఆప్కాబ్తో చర్చలు విఫలం కావడంతో సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక ఆందోళన బాట పట్టింది. సోమవారం డీసీసీబీల వద్ద ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే తదుపరి ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది.
Updated Date - 2023-06-19T03:02:08+05:30 IST