ఏపీ ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం!
ABN, First Publish Date - 2023-06-26T03:54:11+05:30
ఏపీ ప్రజల్లో సైలెంట్ రివల్యూషన్(నిశ్శబ్ద విప్లవం) ఉంది.
జగన్రెడ్డిపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత
వైసీపీ ప్రభుత్వం కూలడం తథ్యం: టీడీపీ నేత యనమల హెచ్చరిక
అమరావతి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ‘ఏపీ ప్రజల్లో సైలెంట్ రివల్యూషన్(నిశ్శబ్ద విప్లవం) ఉంది. సీఎం జగన్ పాలనపై రాష్ట్ర ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగన్ను ఇంటికి పంపించాలనేంత కసితో జనం ఉన్న్టారు’ అని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ’నాలుగేళ్లలో ప్రజాధనం పెద్ద ఎత్తున స్వాహా చేశారు. అన్నివర్గాల్లో జగన్రెడ్డి బాధితులే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా జగన్ బాధిత వర్గాలే. ఎందరో ప్రాణాలను బలిగొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ రౌడీ మూకలను పెంచిపోషించిన దాఖలా లేదు. జగన్ తయారు చేసిన మూకలే జగన్పై తిరుగుబాటు చేస్తున్నాయి. విశాఖలో అధికార పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాపే నిదర్శనం. ప్రజా ధనాన్ని సీఎం, వైసీపీ ఎమ్మెల్యేలు దోచేయడం వల్లే ఖజానా ఖాళీ అయింది. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. వైసీపీ పాలనపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రజలంతా గుంభనంగా ఉంటూ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా? అని కాచుక్కూర్చున్నారు. జగన్ కోట పునాదులు కదులున్నాయి. వైసీపీ ప్రభుత్వం కూలడం తథ్యం’ అని యనమల హెచ్చరించారు.
Updated Date - 2023-06-26T03:54:11+05:30 IST