ఏపీ అప్పులు.. దాచే తిప్పలు!
ABN, First Publish Date - 2023-08-01T04:07:42+05:30
ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్రం ‘అరకొర’ జవాబుతో సరిపెట్టింది. 2019 మార్చి నెలాఖరు నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్ల అప్పు ఉండగా.. 2023 మార్చి నెలాఖరు నాటికి అవి రూ.4,42,442 కోట్లకు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ఓ ప్రశ్నకు
అంతా బాగుందనేలా నిర్మలమ్మ జవాబు
కార్పొరేషన్ అప్పులపై ‘దాటవేత’ ధోరణి
రాష్ట్రం చెప్పిన లెక్కలే పేర్కొన్న వైనం
జీఎస్డీపీలో 32.95% రుణాలే పార్లమెంటులో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్రం ‘అరకొర’ జవాబుతో సరిపెట్టింది. 2019 మార్చి నెలాఖరు నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్ల అప్పు ఉండగా.. 2023 మార్చి నెలాఖరు నాటికి అవి రూ.4,42,442 కోట్లకు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ఓ ప్రశ్నకు సోమవారం ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని... వివిధ మార్గాల్లో చేసిన అప్పులను ఎప్పుడైనా సమీక్షించారా?’’ అని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. అయితే... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సూటిగా సమాధానం చెప్పలేదు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఆమోదించింది. రెవెన్యూ లోటును నియంత్రిస్తూ, రుణాలపై సరైన విధానాన్ని అనుసరిస్తూ, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పాటించేందుకు ఎఫ్ఆర్బీఎం తోడ్పడుతుంది. ఎఫ్ఆర్బీఎం చట్ట అమలును రాష్ట్ర శాసన వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం ఆమోదించిన సిఫారసులకు లోబడి రుణ పరిమితిని విధిస్తుంది’’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కానీ... జగన్ అనుకూల మీడియా దీనికి భిన్నమైన కలరింగ్ ఇచ్చేసింది. జగన్ సర్కారు పరిమితులకు లోబడే అప్పులు చేస్తున్నట్లు కేంద్రం సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా హోరెత్తించింది. నిజానికి... అప్పులపై రాష్ట్ర బడ్జెట్లోని మాయ లెక్కల ఆధారంగా రిజర్వు బ్యాంకు రూపొందించిన నివేదికలోని అంకెలనే నిర్మలా సీతారామన్ తన సమాధానంలో పొందుపరిచారు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులను దాచేశారు. ఈ లెక్కలు చెప్పడంలేదంటూ నాలుగేళ్లుగా ‘కాగ్’ పేర్కొంటోంది. ఈ సమాచారం సేకరించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది. అయినా... కార్పొరేషన్ అప్పుల లెక్కలను రాష్ట్రం చూపించలేదు. ఇది అసలు విషయం! మరోవైపు, రాష్ట్ర జీఎ్సడీపీలో 32.95 శాతం మేర అప్పులు ఉన్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధురి వెల్లడించారు. 2014-15 నుంచి 2023-24 వరకు రూ.6,13,885 కోట్ల మేర నిధులను ఏపీకి బదిలీ చేశామని పేర్కొన్నారు. ఈ మొత్తంలో పన్నుల పంపిణీ రూపేణ రూ.2,92,848 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపేణ రూ.2,92,394 కోట్లు, రుణాలు, అడ్వాన్సుల రూపేణ రూ.28,643 కోట్లు ఉన్నాయని వివరించారు.
అప్పులు పెరిగిన విధం ఇదీ!
సంవత్సరం అప్పులు
(మార్చి ఆఖరు) (రూ.కోట్లు)
2019 2,64,451
2020 3,07,671
2021 3,53,021
2022 3,93,718
2023 4,42,442
Updated Date - 2023-08-01T04:07:42+05:30 IST