17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
ABN, First Publish Date - 2023-07-13T04:10:32+05:30
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తేదీన ఆణివార ఆస్థానం జరగనుంది.
తిరుమల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తేదీన ఆణివార ఆస్థానం జరగనుంది. ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చింది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజైన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ బోర్డు ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి-ఏప్రిల్ నెలలకు మార్చారు. కాగా.. 17వ తేది సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పుష్పపల్లకిలో కొలువుదీరి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆణివార ఆస్థానం సందర్భంగా 17న కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
Updated Date - 2023-07-13T04:10:32+05:30 IST