మణిపూర్ ఘటనపై ఏపీ ఎంపీలు స్పందించాలి
ABN, First Publish Date - 2023-08-02T00:20:47+05:30
మణిపూర్ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఇక్కడి నిరసనలకు సంఘీభావం తెలుపుతూనే పార్లమెంట్లో బీజేపీ తీరుకు వత్తాసు పలకడం సబబు కాదని అన్నారు.
రుణమాఫీ చేసి రైతాంగ ఆత్మహత్యలను నివారించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్
అనంతపురం కల్చరల్, ఆగస్టు 1 : మణిపూర్ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఇక్కడి నిరసనలకు సంఘీభావం తెలుపుతూనే పార్లమెంట్లో బీజేపీ తీరుకు వత్తాసు పలకడం సబబు కాదని అన్నారు. అనంతపురంలోని గణేనాయక్ భవనలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మణిపూర్ ఘటనపై ఘాటుగా స్పందించి, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని అన్నారు. రాష్ట్రంలో వరదలు, కరువుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇందులో కౌలురైతులే ముఖ్య బాధితులని అన్నారు. పంటలకోసం చేసిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలే శరణ్యమన్న పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020 నుంచి కౌలు రైతుల ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం సక్రమం గా ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ తరహాలో రైతు ఏ రూపంలో చనిపోయినా రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలబీమా లోపభూయిష్టంగా ఉందని, ప్రైవేట్ బీమా కంపెనీలకు లాభం చేకూర్చేదిగా ఉందని విమర్శించారు. ఈ బీమా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. 2022లో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో పంటల బీమా కింద ప్రైవేట్ కంపెనీలు రైతులనుంచి ప్రీమియం కింద రూ.90వేల కోట్లు వసూలు చేయగా బీమా కింద అందించింది మాత్రం రూ.700కోట్లు మాత్రమేనన్నారు. రైతాంగ ఆత్మహత్యలను నివారించాలంటే ప్రస్తుతం రైతులకున్న బ్యాంకు, ప్రైవేట్ అప్పులను మాఫీ చేసి, పంటపెట్టుబడి సాయం కింద కొత్త రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T00:20:47+05:30 IST