ఒక్కడిని 159 మంది కొట్టారంట!
ABN, First Publish Date - 2023-09-22T03:32:29+05:30
ఈ ఫొటోలో ఎర్ర షర్ట్ ధరించి, తలకు కట్టు కట్టుకుని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడుతున్న వ్యక్తి పేరు గుర్రాల అర్జున్రెడ్డి.
మారణాయుధాలతో దాడి చేశారని ఫిర్యాదు
అంగళ్లు కేసులో అత్యుత్సాహం
అధికార పార్టీ నాయకుల సేవలో పోలీసులు
టీడీపీ నాయకులపై వేధింపులే లక్ష్యంగా కేసులు
(రాయచోటి-ఆంధ్ర జ్యోతి): ఈ ఫొటోలో ఎర్ర షర్ట్ ధరించి, తలకు కట్టు కట్టుకుని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడుతున్న వ్యక్తి పేరు గుర్రాల అర్జున్రెడ్డి. ఆగస్టు 4న టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో అర్జున్ రెడ్డిపై 159 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇనుపరాడ్లు, కట్టెలు, రాళ్లు తదితర మారణాయుధాలతో దాడి చేసినట్టు పోలీసులు కేసు నమో దు చేయడం గమనార్హం. ఆ మరుసటి రోజే(ఆగస్టు 5న) మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా కురబలకోట మండలానికి వచ్చి అర్జున్రెడ్డిని పరామర్శిస్తున్న ఫొటో ఇదీ. అధికారం పవరేంటో? పోలీసులు తలచుకుంటే ఏం చేయగలరో? చెప్పడానికి ఆ కేసు, ఈ ఫొటో సజీవ సాక్ష్యాలు.
జరిగింది ఇదీ..
రాష్ట్రంలో ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఆగస్టు 4న అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా అంగళ్లులో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై దాడులకు దిగారు. చంద్రబాబుపైనా రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతతో చంద్రబాబుకు గాయాలు కాలేదు. టీడీపీ నాయకులూ ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. అలా జరిగిన దాడిలోనే గుర్రాల అర్జున్రెడ్డి తలకు గాయమైంది.
ఫిర్యాదులో ఏం రాశారంటే..?
ఆగస్టు 5న అర్జున్రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దీనికి పూర్తి విరుద్ధంగా పేర్కొన్నారు. ఆ రోజు ద్విచక్రవాహనంపై పిల్లలకు మందులు తెచ్చుకోడానికి మదనపల్లెకు తాను వెళుతుండగా, అంగళ్లులో టీడీపీ కండువాలు,, జెండాలు పట్టుకుని ఉన్న కొందరు, తనను వైసీపీకి చెందిన వ్యక్తిగా గుర్తించి ఇనుపరాడ్లు, కట్టెలు, రాళ్లు వంటి మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు ముదివేడు పోలీసులు 75/2023 క్రైం నెంబరుతో కేసు నమోదు చేశారు. తొలుత 11 మంది పేర్లను కేసులో చేర్చారు. ఆ తర్వాత ఆ సంఖ్య 102కు చేరింది. తాజాగా ఆ కేసులో నిందితుల సంఖ్య 159కి చేరింది.
టీడీపీ నాయకులే లక్ష్యంగా కేసులు..
టీడీపీ నాయకులపై వేధింపులే లక్ష్యంగా కేసులు నమోదు చేసినట్లు ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంగళ్ల ఘటనలో చంద్రబాబు సహా టీడీపీ వర్గీయులపై మొత్తం ఐదు కేసులు కట్టారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలకు చెందిన ముఖ్యమైన, పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారిని ఈ కేసుల్లో నిందితులుగా చేర్చుతున్నారని చెబుతున్నారు.
ఆ రోజు రాష్ట్రంలో లేనివారిపైనా కేసులు..
అంగళ్లులో ఆ రోజు వైసీపీ నాయకులే దాడికి పాల్పడినట్లు పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. జడ్ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటనకు సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని జిల్లా పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా టీడీపీ నాయకులపైనే పోలీసులు నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఘటన జరిగిన రోజు రాష్ట్రంలో లేని వాళ్లను సైతం అరెస్టు చేసి జైలుకు పంపించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి ఇప్పటికీ పలువురు టీడీపీ నాయకులు జైలులో మగ్గుతున్నారు. అర్జున్రెడ్డి కేసులో పేర్కొన్నట్టు 159 మంది అతనిపై మారణాయుధాలతో దాడి చేసి ఉంటే, అతను బతికే అవకాశం ఉందా? మరుసటి రోజే ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేసేవారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2023-09-22T03:32:29+05:30 IST