కేసీఆర్ 420 సీఎం
ABN, First Publish Date - 2022-11-28T02:23:22+05:30
వాగ్దానాల పేరుతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన సీఎం కేసీఆర్ పక్కా 420 అని వైఎ్సఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.
వాగ్దానాలతో ప్రజలకు వెన్నుపోటు
రాష్ట్రంలో సమస్యలు లేవనడం విడ్డూరం
నాతో పాదయాత్రకు వస్తే నిరూపిస్తా
వైఎ్సఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
3500 కిలోమీటర్లు పూర్తయిన పాదయాత్ర
నర్సంపేట టౌన్, నవంబరు 27 : వాగ్దానాల పేరుతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన సీఎం కేసీఆర్ పక్కా 420 అని వైఎ్సఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పరస్పరం కేసులు పెట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. 222వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజేశ్వర్రావుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్ నుంచి ఆదివారం ప్రారంభమైంది. గ్రామాల్లో షర్మిలకు ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఆమె మిర్చి పంటను పరిశీలించారు. సాయంత్రం నర్సంపేటకు యాత్ర చేరుకుంది. పాదయాత్ర 3,500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందున పట్టణంలో వైఎస్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను షర్మిల, ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి వారు ప్రసంగించారు. రాష్ట్రంలో సమస్యలు లేవని కేసీఆర్ చెబుతున్నారని, ఆయన తనతో పాదయాత్ర వస్తే సమస్యల్ని చూపిస్తానని షర్మిల చెప్పారు. ‘సమస్యలను నేను చూపిస్తా, అభివృద్ధిని మీరు చూపించాలి.
నిజంగా ఒక్క సమస్య కూడా లేకపోతే కేసీఆర్కు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి ఇంటికెళ్లిపోతా. లేదంటే టీఆర్ఎస్ పాలన దరిద్రంగా ఉంటే కేసీఆర్ రాజీనామా చేసి ఫాంహౌ్సకు వెళ్లిపోవాల’ని సవాల్ విసిరారు. షర్మిల తెలంగాణలో ఒక ప్రభంజనంలా మారబోతు న్నారని, ఆమె రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా సీఎం కానున్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. పదేళ్ల క్రితం 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రికార్డు సృష్టించిన షర్మిల నేడు 3,500 కిలోమీటర్లు నడవడం ఆషామాషీ కాదంటూ విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారు. షెడ్యూల్లో విజయమ్మ పర్యటన లేకున్నా అకస్మాత్తుగా ఆమె రావడంతో పెద్దఎత్తున వచ్చిన జనం ఆమెకు జేజేలు పలికారు. భాంజిపేట వద్ద రైతులు షర్మిలను కలిసి తాము పంటలు నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరా పార్కు చౌరస్తాలో వేడుకలు
కవాడిగూడ: వైఎస్ షర్మిల పాదయాత్ర 3,500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఇందిరాపార్కు చౌరస్తాలో వైఎస్సార్టీపీ ముషీరాబాద్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ ఆకుల ప్రవీణ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టిన షర్మిలకు తెలంగాణలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రవీణ్ అన్నారు. జిల్లాల్లో పాదయాత్ర పూర్తయిన తరువాత త్వరలోనే జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో షర్మిల పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. పార్టీ హైదరాబాద్, సికిందాబ్రాద్ పార్లమెంటు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు వాడుక రాజ్గోపాల్, భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-28T02:23:23+05:30 IST