యాదాద్రిలో వైభవంగా గోదా కల్యాణోత్సవం
ABN, First Publish Date - 2022-01-15T01:02:37+05:30
ధనుర్మాస వేడుకల్లో భాగంగా శుక్రవారం గోదారంగనాథుల కల్యాణోత్సవ పర్వాలు వైభవంగా నిర్వహించారు.
యాదాద్రి: ధనుర్మాస వేడుకల్లో భాగంగా శుక్రవారం గోదారంగనాథుల కల్యాణోత్సవ పర్వాలు వైభవంగా నిర్వహించారు. రాత్రి వేళ బాలాలయంలో స్వామి, అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అర్చకుల వేదమంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల మధ్య గోదా కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. యాదాద్రి దేవస్థాన అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మధ్యాహ్నం ఆండాల్ అమ్మవారిని, రంగనాథుడిని దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు విశ్వక్సేనుడికి తొలి పూజలతో కల్యాణతంతు నిర్వహించారు. స్వామికి సువర్ణ పుష్పార్చన, ఆండాల్ అమ్మవారి ఊంజల్ సేవోత్సవ పర్వాలు శాస్త్రోక్తంగా జరిగాయి. కాగా నూతన వధూవరులు గోదారంగనాయకస్వామికి మరుసటి రోజున ఒడిబియ్యం సమర్పిస్తారు. ఆండాల్ అమ్మవారికి శనివారం మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఒడిబియ్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటారు.
Updated Date - 2022-01-15T01:02:37+05:30 IST