HYD : పక్కింటి మహిళ ఫొటోలు మార్ఫింగ్ చేసి.. భర్తకు కొరియర్ చేసి..!
ABN, First Publish Date - 2022-03-12T14:28:51+05:30
పక్కింటి మహిళ ఫొటోలు మార్ఫింగ్ చేసి.. భర్తకు కొరియర్ చేసి..!
- నిందితుడిని కటకటాల్లోకి నెట్టిన సైబరాబాద్ షీటీమ్స్
హైదరాబాద్ సిటీ : పక్కింటి వారిపై పగ పెంచుకున్న ప్రబుద్ధుడు ఆ దంపతుల మధ్య విభేదాలు సృష్టించి విడదీయాలని చూశాడు. పక్కింటి మహిళ ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, తన ఫొటోతో జతచేసి ఏమీ తెలియనట్లుగా ఆమె భర్తకు కొరియర్ చేశాడు. ఆ మహిళ భర్త సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, షీటీమ్స్ నిందితుడిని గుర్తించి కటకటాల్లోకి నెట్టింది. మియాపూర్కు చెందిన బాధితుడి ఇంటికి కొరియర్ వచ్చింది. అందులో తన భార్య పక్కింటి వ్యక్తితో అశ్లీలంగా ఉన్న ఫొటోలు ఉన్నాయి.
షాక్కు గురైన అతడు కొంత సేపటికి తేరుకుని భార్యను అనుమానించకుండా ఫొటోలను పరీక్షించి చూశాడు. మార్ఫింగ్ చేసినవని గుర్తించాడు. ఆన్లైన్లో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ డీసీపీ అనసూయ పర్యవేక్షణలో మియాపూర్ షీటీమ్ బృందం రంగంలోకి దిగింది. బాఽధితుల నుంచి వివరాలు సేకరించింది. కొరియర్ సర్వీస్ నుంచి పలు ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్లు సేకరించింది. పక్కింట్లో ఉండే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించి కటకటాల్లోకి నెట్టింది. ఆ దంపతుల అన్యోన్యాన్ని చూసి ఓర్వలేక, వారి మధ్య గొడవలు సృష్టించేందుకే నిందితుడు ఇలా చేసినట్లు విచారణలో తేలింది. తన భార్య ఫోన్లో ఉన్న పక్కింటి మహిళ నంబర్ను తీసుకుని, ఆమె వాట్సాప్ డీపీని డౌన్లోడ్ చేసి, ఆ ఫొటో పక్కన తన ఫొటో పెట్టి అశ్లీలంగా, అసభ్యంగా మార్ఫింగ్ చేసి ఫొటోలు ప్రింట్ తీశాడు. పక్కింటి మహిళకు, తనకు సంబంధం ఉందని ఆమె భర్తకు అనుమానం కలిగించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు పంపినట్లుగా ఆ ఫొటోలు కొరియర్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.
Updated Date - 2022-03-12T14:28:51+05:30 IST