డంపింగ్ యార్డు కాలుష్యంపై జిల్లా జడ్జి ఆరా
ABN, First Publish Date - 2022-01-22T05:30:00+05:30
డంపింగ్ యార్డు కాలుష్యంపై జిల్లా జడ్జి ఆరా
యార్డు పరిసరాల పరిశీలన...
స్థానికుల నుంచి వివరాల సేకరణ...
మడికొండ, జనవరి 22: కాజీపేట మండలం మడికొండ శివారులోని చెత్త డంపింగ్ యార్డుతో పాటు పెద్ద చెరువును శనివారం జిల్లా జడ్జి నందికొండ నర్సింగరావు సందర్శించారు. డంపింగ్యార్డు నుంచి వస్తున్న విషవాయువులతో మడికొండ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పెద్ద చెరువు కలుషితమవుతున్న విషయాన్ని వివరిస్తూ 2018లో మాజీ కార్పొరేటర్ తొట్ల రాజుయాదవ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందజేయాలంటూ జిల్లా జడ్జికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జిల్లా జడ్జి నర్సింగరావు, జీడబ్ల్యుఎంసీ కమిషనర్ ప్రావీణ్య, రెవెన్యూ అధికారులతో కలిసి డంపింగ్ యార్డును సందర్శించారు. డంపింగ్ యార్డును, పెద్ద చెరువు, సోమిడి చెరువు, వడ్డెపల్లి చెరువు, వరద కాల్వలను పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డు వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలు ఏకరువు పెట్టారు. చెరువు నీరు కలుషితమై చేపలు మరణిస్తున్నాయని, కలుషిత నీటితో చెరువు నీరు కలుషితమవుతున్న తీరును స్థానికులు జడ్జికి వివరించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. దీనికి సంబంధించిన నివేదికను త్వరలోనే హైకోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఇంకా కాజీపేట తహసీల్దార్, కిరణ్కుమార్, ఎంహెచ్వో రాజారెడ్డి, ఈఈ లక్ష్మారెడ్డి, ఆర్ఐ సురేందర్, మాజీ వార్డు మెంబర్ దువ్వ చిన్నకుమార్, కాంగ్రెస్ మహిళా విభాగం కాజీపేట మండల అధ్యక్షురాలు బైరి రజినీవేణుయాదవ్, మందల సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST