త్వరలో రజాకార్ ఫైల్స్ తీస్తాం
ABN, First Publish Date - 2022-04-30T07:50:37+05:30
‘‘తెలంగాణలో టీఆర్ఎస్ గడీలు బద్దలు కొట్టి, తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేసేది బీజేపీయేనని
- అందులో కేసీఆర్, కేటీఆర్ చరిత్ర పెడతాం..
- పెట్రోల్పై వ్యాట్తో రూ.69వేల కోట్లు వచ్చాయ్.. ఏం చేశారు?
- రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే: బండి సంజయ్
- బీజేపీ ప్రభుత్వం వస్తే కేసీఆర్ కుటుంబం కటకటాల్లోకే: డీకే అరుణ
- టీఆర్ఎ్సకు సరైన మొగుడు బండి సంజయ్: రాజాసింగ్
మహబూబ్నగర్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలో టీఆర్ఎస్ గడీలు బద్దలు కొట్టి, తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేసేది బీజేపీయేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్సర్కారే.’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనే భ్రమల్లో కేసీఆర్ ఉన్నారని, కానీ రాష్ట్రంలో హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలతోనే ప్రజలు టీఆర్ఎ్సని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని అన్నారు.
పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.30 చొప్పున వ్యాట్ వేసి ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.69,334 కోట్లు వసూలు చేసిందని, ఈ నిధులను ఏం చేశారని నిలదీశారు. నెల క్రితం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 1.5 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటన చేశారని, మొన్న ప్లీనరీలో 2.5 లక్షల ఉద్యోగాలిస్తున్నామని అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారానికి కేంద్రం సిద్ధంగా ఉందని, సీఎం కేసీఆర్ సహకరిస్తే ఆరు నెలల్లో కర్ణాటక, ఏపీతో మాట్లాడి పనులను పూర్తి చేయించే బాధ్యత కేంద్రానిదని, ఇందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు.
ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా 16వ రోజు నారాయణపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన ఆర్మీ గురించి దేశప్రజలకు వివరించేందుకు తీసిన యూరీ సినిమాపైనా, కశ్మీరీ పండిట్లపై తీసిన కశ్మీర్ఫైల్స్ పైనా టీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. త్వరలో రజాకార్ ఫైల్స్ తీస్తామని, అందులో కేసీఆర్, కేటీఆర్ల చరిత్ర కూడా పెడతామని అన్నారు. శుక్రవారం రోజే తాను ముంబై వెళ్లే బస్సు ఎక్కి పరిశీలిస్తే ప్రతిరోజూ వందల కుటుంబాలు వలసవెళుతున్న విషయం స్పష్టమైందని చెబుతూ ఆ రెండు వీడియోలను కూడా ప్రదర్శించారు.
‘మూర్ఖపు సీఎం.. పాలమూరు నుంచి వలసలు ఆగాయని అబద్ధాలాడుతున్నారు. పాలమూరు రోజూ ముంబైకి బస్సు పొతుంటే కనిపిస్తలేదా? ఉపాధి, సాగునీటి వసతి, ఉద్యోగాలిస్తే కదా వలసలు ఆగేది? మీరు ఏడేళ్లలో అబద్ధాలు మాట్లాడటం తప్ప పాలమూరుకు చేసిందేమి లేదు? బతుకుదెరువుకు ఈ ప్రాంతం నుంచి నేటికీ నిత్యం వందల కుటుంబాలు ముంబైకి వలస పోతున్నాయి. వలసలు ఆగాయనే అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయొద్దు’ అని ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ జితేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ యువతను సీఎం కేసీఆర్ మోసం చేశారని, ఏడేళ్లలో ఉద్యోగాలివ్వకుండా ద్రోహం చేశారని విమర్శించారు.
నారాయణపేట జిల్లా జైసల్మేర్గా మారే పరిస్థితి ఏర్పడిందని, ఎక్కడ చూసినా పొలాలు నెర్రెలు బారి ఎడారిలా మారే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ఉపాఽధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వస్తే కేసీఆర్ కుటుంబం కటకటాల్లోకి వెళ్లక తప్పదన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుతున్న టీఆర్ఎస్ నేతలకు బండి సంజయే సరైన మొగుడని అన్నారు.
పీఎంవోను బద్నాం చేసే యత్నం: సంజయ్
హైదరాబాద్: సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్లవి పచ్చి అబద్ధాలని బండి సంజయ్ మండిపడ్డారు. వారిది పూటకో మాట.. రోజుకో బాట అని ఆరోపించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా, సీఎం కేసీఆర్ ఒకవిధంగా స్పందించగా, కేటీఆర్ మాత్రం పీఎంవోను బద్నాం చేసే యత్నం చేశారని ఆరోపించారు. మోదీ పర్యటన సమయంలో, ఇద్దరు కుటుంబసభ్యులు కరోనా బారినపడ్డారని, ఆ పరిస్థితిలో ప్రధాని పర్యటనకు హాజరు కావడం సమంజసం కాదనే వెళ్లలేదని కేసీఆర్ మీడియా సమావేశంలోనే ప్రకటించారన్నారు. కేటీఆర్ ప్రకటన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని ట్విటర్ వేదికగా సంజయ్ విమర్శించారు.
Updated Date - 2022-04-30T07:50:37+05:30 IST