Vikarabad టీఆర్ఎస్లో అసంతృప్త జ్వాలలు.. పార్టీ పెద్దలకు ముచ్చెమటలు
ABN, First Publish Date - 2022-07-15T00:27:23+05:30
Vikarabad టీఆర్ఎస్లో అసంతృప్త జ్వాలలు.. పార్టీ పెద్దలకు ముచ్చెమటలు
వికారాబాద్ (Vikarabad): టీఆర్ఎస్ (Trs)లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కారు పార్టీలో కుమ్ములాటలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదిపత్యం కోసం వర్గాల మధ్య పోరు సాగుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. పరస్పరం సవాళ్లు విసురుకుంటున్న నేతలు టీఆర్ఎస్ పెద్దలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
కారు రివర్స్లో వెళుతోంది. ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉద్యమ పార్టీలో ఇప్పుడంతా టికెట్ల కోణంలోనే రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలో చాలా చోట్ల నేతల మధ్య పొసగడం లేదు. కాంగ్రెస్ (Congress) నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు పాత నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. మరోవైపు ఆదిపత్య పోరు దాడుల వరకు వెళుతోంది. వికారాబాద్ టీఆర్ఎస్లో మంటలు పార్టీలో కలకలం రేపింది.
వికారాబాద్ టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మర్పల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి (Sunitha Mahendar Reddy)ని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ (Mla Metuku Anand) వర్గీయులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి (Ex Minister Mahendar Reddy), ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. మహేందర్ రెడ్డి సతీమణి సునీత పర్యటనతో ఈ విభేదాలు రచ్చకెక్కాయి. జడ్పీ చైర్ పర్సన్ (Zp Chair Person) వాహనంపై రాళ్లు విసరడంతో ఉద్రక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అనుమతి లేకుండా జడ్పీ పర్సన్ పర్యటించకూడదా అంటూ సునీత ప్రశ్నించారు. దాడి ఘటనపై ఎస్పీ కోటిరెడ్డి (Sp Koti Reddy)కి ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
Updated Date - 2022-07-15T00:27:23+05:30 IST