మరోసారి సెలవుల్లోకి GHMC ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
ABN, First Publish Date - 2022-07-02T18:03:25+05:30
నగరంలో ఫ్లెక్సీల పంచాయతీ వేళ జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ (GHMC Enforcement) అధికారులు మరోసారి సెలవుల్లోకి వెళ్లారు.
హైదరాబాద్: నగరంలో ఫ్లెక్సీల పంచాయతీ వేళ జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ (GHMC Enforcement) అధికారులు మరోసారి సెలవుల్లోకి వెళ్లారు. నగరంలో వెలిసిన ఫ్లెక్సీలపై జరిమానా విధించడాన్ని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ నిలిపివేసింది. నగర వ్యాప్తంగా ఎలాంటి అనుమతి లేకుండా టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) పార్టీల ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. నిన్నటి నుంచి ఫైన్లు వేయడాన్ని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నిలిపివేసింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటికీ జీహెచ్ఎంసీ ఎలాంటి ఫైన్స్ వేయకపోవడమే కాకుండా ఫ్లెక్సీలను కూడా తొలగించకుండా ఉండిపోయింది. ఇప్పటికే నగరంలో భారీగా ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, కటౌట్లు వెలిశాయి. స్వయంగా జీహెచ్ఎంసీ నగర మేయర్ ఆధ్వర్వంలోనే వందలాది ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. నిన్నటి వరకు బీజేపీకి 2 లక్షలు, టీఆర్ఎస్కు లక్ష వరకు ఈవీడీఎం జరిమాన విధించింది. కాగా... గతంలో నగరవాసులు టూలెట్ బోర్టు పెడితేనే అధికారులు ఫైన్లు విధించారు. నేడు నగరవ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు వెలిసినప్పటికీ చూసీచూడకుండా ఉంటున్న జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2022-07-02T18:03:25+05:30 IST