TS News: గాంధీ ఐడియాలజీ సెంటర్లో మహాత్మ జయంతి వేడుకలు...పాల్గొన్న రేవంత్
ABN, First Publish Date - 2022-10-02T17:17:34+05:30
నగరంలోని బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్: నగరంలోని బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ముఖ్య అతిథిగా హాజరై... గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి.. పతాకావిష్కరణ చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ... దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమంలో డూ ఆర్ డై అనే నినాదంతో స్వాతంత్రం అందించారు గాంధీజీ అని అన్నారు. గాంధీ స్పూర్తితో నెహ్రూ హరిత విప్లవం తీసుకొచ్చారని తెలిపారు. సాగినీటిని రైతులకు అందించి దేశంలో దారిద్ర్యాన్ని పారద్రోలారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించి అణగారిన వర్గాలకు అధికారం అందించిన శక్తి కాంగ్రెస్ (Congress) పార్టీ అని తెలిపారు. బీజేపీ విష వృక్షం దేశాన్ని కబాలించాలని చూస్తోందని టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మండిపడ్డారు.
కేసీఆర్ (KCR), మోదీ(Narendra modi) బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారన్నారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవలనుకుంటున్నారని విమర్శించారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ (Telangana CM) కూడా బీజేపీ (BJP) విధానాలనే అవలంభిస్తున్నారన్నారు. ప్రజల మధ్య విద్వేషపు గోడలు నిర్మించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చవకబారు నేతల విభజించు పాలించు విధానాలను తిప్పికొట్టేందుకే రాహుల్ గాంధీ (Rahul gandhi) జోడో యాత్ర అని చెప్పారు. సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రం రాహుల్ యాత్రకు అండగా నిలుస్తుందన్నారు. గాంధీ స్పూర్తితో మనందరం భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో కదం కదం కలపాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Updated Date - 2022-10-02T17:17:34+05:30 IST