కాసేపట్లో బాసరకు Revanth reddy
ABN, First Publish Date - 2022-06-17T15:09:51+05:30
సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు మద్దుతు తెలుపుతున్నాయి.
హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT) వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు ప్రతిపక్ష పార్టీలు మద్దుతు తెలుపుతున్నాయి. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) బాసరకు బయలుదేరి వెళ్లనున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల న్యాయమమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... ట్రీపుల్ ఐటీ బాసర క్యాంపస్లో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. అహంకారంతో సీఎం కేసీఆర్ విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
బాసరకు బండి... పోలీసుల అలర్ట్
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) కూడా బాసరకు వెళ్లనున్నారు. ట్రీపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు వినేందుకు బండి సంజయ్ బాసరకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి భారీ అనుచరగణంతో సంజయ్ బాసరకు పయనమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక సందర్భంగా జిల్లాల్లో ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కాగా... బాసరకు బండి సంజయ్ రాకతో పోలీసుల అలర్ట్ అయ్యారు. నిజామాబాద్ నుంచి భైంసా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. మధ్యాహ్నం తర్వాత పునరుద్ధరిస్తామని అధికారుల వెల్లడించారు.
పోలీసుల కట్టుదిట్టమైన భద్రత
బాసర క్యాంపస్ వద్ద విద్యార్థుల ఆందోళనలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. వరుసగా నాలుగో రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నందున... విద్యార్థులు కనిపించకుండా గేట్లకు రేకులను అడ్డుపెట్టారు. ఇతరులు ఎవరూ రాకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే తాము బయటకు కనిపించకుండా బారికేడ్లు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రెండో గేట్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. రేవంత్, బండి సంజయ్ రానుండటంతో బాసరలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Updated Date - 2022-06-17T15:09:51+05:30 IST