‘ఆటా’ ప్రాంగణంలో తెలంగాణ పెవిలియన్
ABN, First Publish Date - 2022-07-04T09:19:14+05:30
అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17వ మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రారంభించారు.
- ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- ఆటా అంటే ‘ఆంధ్ర-తెలంగాణ అసోసియేషన్’గా అభివర్ణన
- బతుకమ్మ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
(వాషింగ్టన్ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ): అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17వ మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రారంభించారు. రచయిత్రి ప్రభావతి రాసిన బతుకమ్మ ప్రత్యేక సంచికను సైతం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటా ప్రతినిధులతో పాటు ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్, ఇతర సాహితీ ప్రముఖులు హాజరయ్యారు. ఆటా మహాసభల్లో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని ఈ సందర్భంగా కవిత అన్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అమెరికాలో ఉన్న తెలుగు వారికి తెలియడంతో పాటు ఇతర రాష్ట్రాల వారికి స్ఫూర్త్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ‘ఆటా’ అంటే ఆంధ్ర-తెలంగాణ అసోసియేషన్ అంటూ ఆమె అభివర్ణించారు. భారతదేశంలో తెలుగువారికి ఎన్టీ రామారావు గతంలో గుర్తింపు తీసుకురాగా, తెలంగాణ వారికి కేసీఆర్ గుర్తింపు తెచ్చారని తెలిపారు. మాల్దీవ్స్, మారిష్సలో ఉన్న తెలుగువారు మన భాష, సంస్కృతిని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. శనివారం, ఆదివారం చేపట్టిన పలు కార్యక్రమాల్లో తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, నిరంజన్రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఆటా వ్యవస్థాపక సభ్యుడు హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ పెవిలియన్ కూడా..
ఆటా వేడుకల ప్రాంగణంలో ఏపీ పెవిలియన్ను ఆ రాష్ట్ర ప్రతినిధులు రత్నాకర్ పండుగాయల, హరిప్రసాద్ లింగాల, మేడపాటి మోహన్ ఆరంభించారు. ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రాఘవరెడ్డి, నారమల్లి పద్మజారెడ్డి, వెరోనికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఏపీ-తెలంగాణ పెవిలియన్ల ఏర్పాటు సందర్భంగా ఆయా రాష్ట్రాల సీఎంలకు అనుకూలంగా నినాదాలు మిన్నంటాయి.
Updated Date - 2022-07-04T09:19:14+05:30 IST